మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా రాజోలు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కేటాయించకుండా టీడీపీ మొండిచెయ్యి చూపిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గొల్లపల్లి సూర్యారావు పలు సంచలనమైన ఆరోపణలు చేశారు. టీడీపీలో నిబద్దతతో పనిచేశానని కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను మెడబట్టి బయటకు గెంటారని, లోకేష్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తుందని, చంద్రబాబులా రాష్ట్రంపై గుత్తాధిపత్యం చలాయించి రాష్ట్రాన్ని చిందరవందర చేయాలని లోకేష్ ప్రయత్నిస్తున్నాడని, లోకేష్ అహంకారం, దుర్మార్గపు భావజాలం ఎదుటివారిని నూన్యతగా చూసే ఆలోచనలు ప్రజాస్వామ్యంలో పనికి రావని సంచలన ఆరోపణలు చేశారు.
బాధలో ఉన్న నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారని గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు. కాగా గతంలో కాంగ్రెస్ లో కొనసాగిన గొల్లపల్లి సూర్యారావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రాజోలు నుంచి పోటీచేసి విజయం సాధించారు. మళ్లీ 2019లో కూడా రాజోలు నుంచి బరిలోకి దిగిన సూర్యారావు జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. తాజాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి సూర్యారావు పేరు లేకపోవడం, టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీ స్పష్టం చేయడంతో నేడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.