తెలుగుదేశం యువరాజుగా పిలిపించుకుంటున్న చంద్రబాబు నాయుడి తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సభలను పార్టీ నాయకులు, కార్యకర్తలే పట్టించుకోవడం లేదు. పాదయాత్ర ముగిసిన చాలా కాలం తర్వాత బయటికి వచ్చిన లోకేశ్ శంఖారావం పేరుతో ఎన్నికల సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి వీటికి స్పందన కరువైంది. ఇవి కామెడీ సభలని తెలుగు తమ్ముళ్లు దూరంగా ఉంటున్నారు. బతిమిలాడి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో జరిగిన సభలు వెలవెలబోయాయి. మడకశిర టికెట్ను ఇన్చార్జి గుండమల తిప్పేస్వామికి కాకుండా సునీల్ కుమార్కు ఇచ్చేశారు. దీంతో తిప్పేస్వామి వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. వారు సభను పట్టించుకోలేదు. మరోవైపు సునీల్ కుమార్ నాయకులు, కార్యకర్తల్ని సమీకరించడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి. జగన్.. నీ కుర్చీ మడతేస్తానని ప్రగల్బాలకు పోయిన లోకేశ్ హిందూపురంలో ఖాళీ కుర్చీలకు ప్రసంగం వినిపించాల్సి వచ్చింది. తెలుగు తమ్ముళ్లు, జనం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో చినబాబు ముఖ్య నాయకులపై తీవ్ర స్వరంతో ఆగ్రహించారని సమాచారం.
గతంలో పాదయాత్ర సమయంలో ఇరుకు వీధుల్లో చిన్నపాటి సభలు పెట్టి జనం వచ్చేస్తున్నారని బిల్డప్ ఇచ్చిన చరిత్ర లోకేశ్ది. పేరుకి మాజీ సీఎం కొడుకు అయినా పార్టీ నేతలే ఆయన కార్యక్రమాలను పట్టించుకోరు. డబ్బులిస్తాం శంఖారావం సభలకు రావాలని అభ్యర్థులు కార్యకర్తల్ని బతిమిలాడుకుంటున్నా పోపోవయ్యా అనేస్తున్నారు. చాలాచోట్ల నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. వాటి గురించి అధిష్టానం పట్టించుకోవడం లేదు. సభలకు వెళ్తే టీడీపీ కార్యకర్తలు కొడతారనే భయంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు.
మరోవైపు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. పేరుకు అధినేతే అయినా ఆయన రా కదలి రా సభలకు జనం కరువయ్యారు. ఎన్నికల సమయంలో అంతా రివర్స్లో జరుగుతోందని తండ్రీకొడుకులు ఆందోళన చెందుతున్నారు.