టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేల్చిన బాంబు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. నేను కుప్పంలో పోటీ చేస్తే ఓటేస్తారా అని నాలుక కర్చుకున్న భువనేశ్వరి తర్వాత జోక్ అన్నారు. కానీ సాధారణంగా ఎవరైనా జోక్ వేస్తే ఏదో ఆ క్షణం నవ్వుకుని వదిలేస్తారు కానీ ఆ జోక్ గురించి ఏకంగా చర్చలు జరపరు. కానీ ఇప్పుడు భువనేశ్వరి వ్యాఖ్య జోక్ గా కాక రాష్ట్ర టీడీపీ కేడర్ లో కలవరానికి కారణం అయింది.
నిజానికి చంద్రబాబు & టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంది. కుప్పంలో కూడా చంద్రబాబు గెలుస్తాడో లేదో అనే సందేహాలు టీడీపీ కేడర్ లో మొదలయ్యాయి. పార్టీ పరిస్థితి ఎక్కడివేసిన గొంగళి అక్కడిలానే ఉంది. జనసేనతో పొత్తు కారణంగా కనీసం అభ్యర్థులను కూడా చంద్రబాబు ధైర్యంగా ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి భువనేశ్వరి పోటీకి దిగుతాను అనడం జోక్ ఎలా అవుతుంది.? చంద్రబాబే తాను ఓడిపోతాననో లేక గతంలో చేసిన అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లే అవకాశం ఉందనే భయంతో భువనేశ్వరిని ముందుగా ప్రిపేర్ చేసి చెప్పించారా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయాల వల్లనే టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తిందని టీడీపీ కేడర్ లో చర్చ జరుగుతుంది. టీడీపీ ఆవిర్భావం తరువాత రాజ్యసభలో ఒక్క అభ్యర్ధికి కూడా అవకాశం దక్కకపోవడం టీడీపీ దుస్థితికి అద్దం పడుతుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అమరావతి భూముల స్కామ్ చంద్రబాబును వెంటాడుతున్నాయి. జనసేనతో కూటమి కట్టినా గెలిచే పరిస్థితి లేదని బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న బాబు, కూటమి తరపున ఓ యాభై సీట్లు గెలుచుకుని రాజ్యసభ కు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా చేరితే కేసుల గొడవలు ఉండవనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో గెలిచే సత్తా లేకున్నా ఎమ్మెల్సీని చేసి దొడ్డి దారిలో లోకేష్ ను మూడు శాఖలకు మంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు సొంతం. తాజాగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే చంద్రబాబు కేసుల నుండి బయటపడటానికి ఆడుతున్న డ్రామాలానే కనిపిస్తుంది. ఈ కేసుల గొడవలు లేకుండా బీజేపీ కూటమిలో కేంద్ర మంత్రిగా కాలం గడిపేయడమే బాబు మాస్టర్ ప్లాన్ లో భాగంగానే భువనేశ్వరితో తెలివిగా వ్యాఖ్యలు చేయించి ఉంటాడన్న సందేహాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి చంద్రబాబు ప్లాన్ ఫలిస్తుందా? కాలమే సమాధానం చెబుతుంది.