కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై జనసైనికులు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. తమ పార్టీలో చేరలేదనే అక్కసుతో తిడుతున్నారు. దీనిపై ముద్రగడ స్పందించారు. శనివారం కిర్లపూడిలో ప్రెస్మీట్ పెట్టి పవన్, ఆయన అభిమానుల తీరుపై ఫైరయ్యారు.
తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బేషరుతుగానే చేరా. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. ఈ విషయం అందరికీ తెలుసు. దళితుల వల్ల ఈ స్థితికి వచ్చా. నేను ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ వెంట నడుస్తున్నాను. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా నన్ను విమర్శిస్తున్నాడు. నాకు చెప్పడానికి మీరెవరు.
వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్కు దూరం చేశాయి. ఇన్నాళ్లకు ఆ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ వద్దకు ఎందుకెళ్లావని కొందరు కామెంట్లు పెడుతున్నారు. సీఎం కుటుంబానికి రాజకీయంగా చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేను హీరో. మీరా నాకు పాఠాలు చెప్పేంది? ఏపీలో ఎన్నికలు ముగిశాక జనసేన పార్టీ క్లోజ్ అవడం ఖాయం.
చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదు? 21 సీట్లతో అతను కూడా బాధపడే ఉంటాడు. అవి కూడా తెలుగుదేశానికి తిరిగి ఇచ్చేస్తే మంచింది. ఆయన్ను మారుద్దామని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. తక్కువ సీట్లకు పరిమితం కావడంతో బలమేంటో ప్రజలకు తెలిసిపోయింది.
వైఎస్సార్సీపీలో చేరిన రెండో రోజే ముద్రగడ ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ప్రతిపక్షాలపై కన్నెర్ర చేశారు. జనసేనకు చెందిన చోటా నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్టాపిక్ అయ్యింది.