మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి ఓపెన్ అయిపోయాడు. పూర్తి పలుకులు పలకడానికి ఒక ఒక్క స్టెప్ దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతానికి కూటమిలోని ఇద్దరి గురించి మాత్రం చెప్పాడు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ముసుగును పూర్తిగా తీసేయనున్నారు.
తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం మెగా బ్రదర్స్ది. ఇది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ పనులు చేయించుకోవడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. పీఆర్పీని కాంగ్రెస్లో కలిపి రాజ్యసభ సభ్యుడై కేంద్ర మంత్రి పదవి వెలగబెట్టిన ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ఎన్డీఏకు దగ్గరగా జరిగాడు. బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పద్మవిభూషణ్ తెచ్చుకున్నాడు. సినిమా హీరో కదా.. కొన్ని ఓట్లు వస్తాయని కమలం పెద్దలు ఇతనితో స్నేహం కొనసాగిస్తున్నారు.
అలా అని చిరంజీవి ఒక్కరితోనే సంసారం చేయడంలేదు. మొన్నటి వరకు తెలంగాణాలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భజనలో మునిగితేలాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. నేను ఆ పార్టీ వాడినేనంటూ సీఎం రేవంత్రెడ్డితో సంబంధాలు కలిపాడు. అటు కేంద్రం.. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒంగి దండాలు పెడుతూ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు.
ఏపీ విషయానికొస్తే ఇంతకాలం తమ్ముడు పవన్ కళ్యాణ్కు పరోక్షంగా అండగా ఉన్నాడు. అతని విషయంలో ఫ్యామిలీలో కాస్త విభేదాలున్నా సర్దిచెబుతూ వచ్చాడు. ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తన ముసుగు కొంచెం కొంచెంగా తొలగిస్తున్నాడు. తాజాగా సీఎం రమేష్, పంచకర్ల రమేష్కు మద్దతు ప్రకటిస్తూ వారిని పక్కన పెట్టుకుని మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు. ‘రాజకీయాల నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నా. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా ఏర్పడ్డారు. మంచి పరిణామం. నా చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా, నాకు బాగా కావాల్సిన పంచకర్ల రమేష్ పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఇద్దరు మంచివారు. సమర్థులు. సీఎం రమేష్కు కేంద్రంతో సంబంధాలు బాగున్నాయి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరినీ గెలిపించండి. ఏపీ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలి. ఇందుకు ఇలాంటి వారికి ఓటు వేయండి’ అని బిగ్ బ్రదర్ అన్నారు.
ప్రస్తుతం పవన్ తీరుతో కాపులు విసిగిపోయారు. సీట్లు తక్కువగా తీసుకున్న నేపథ్యంలో ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే భయం అటు జనసేన, ఇటు టీడీపీలో ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు చిరంజీవిని రంగంలోకి దించాడు. సేనానికి పడేసినట్లుగానే అతనికి ప్యాకేజీ ఇచ్చాడు. ఇటీవల చిరును సీఎం రమేష్ కలవగా ఫొటోలు విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా వీడియో వదిలారు. మరికొద్దిరోజుల్లో పూర్తి ముసుగు తీసేసి కూటమికి ఓటు వేయండని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ తనకు పద్మవిభూషణ్ ఇప్పించింది. చంద్రబాబుతో పవన్ సన్నిహితంగా ఉన్నాడు. అధికారంలోకి వస్తే ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు.
మొత్తంగా మెగా బ్రదర్స్ దగా బ్రదర్స్గా మారిపోయారు. చిరంజీవి గోడ మీద పిల్లిలా తయారయ్యాడు. తన స్వార్థం కోసం ఎవరితోనైనా అంటకాగుతానని మరోసారి నిరూపించాడు. పవన్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని సొంత అభిమానులనే మోసం చేశాడు. ఇక నాగబాబు డొనేషన్లు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్లంతా ప్రజా సేవలకులమని బిల్డప్ ఇస్తుంటారు. ఆయ్యా బ్రదర్స్ మీరు సినిమాల్లో నటిస్తే సరిపోతుంది. నిజ జీవితంలో అవసరం లేదు.