లోకేష్ మళ్ళీ ప్రజలను కలిసే ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. ఈ నెల 11 నుంచి మళ్ళీ రోడ్డెక్కనున్నారు. దీనికి ఇచ్చాపురం తొలి వేదిక కానుంది. పదకొండు నుండి శంఖారావమే అని తెలుగు తమ్ముళ్ళ వాట్సాపుల్లో ఊదరగొడుతున్నారు.
అయితే ఇది ఘనంగా జరగబోతుందా లేక గతంలో చేసిన యువగళం పాదయాత్ర లా పలు ఇబ్బందులతో జరగనుందా అనేది తెలియరాలేదు. గతంలో కూడా యువనేత యువగళం అంటూ చేసిన పాదయాత్ర రోజూ నాలుగు గంటలు మాత్రమే సాగుతూ.. అది కూడా ఎండ తక్కువ ఉన్న సమయంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగింది.
రోజుకు నాలుగు బ్రేకులు, నాలుగు రోజులకోసారి కమర్షియల్ బ్రేకులు, జయంతి ఉత్సవాలు, వర్ధంతి దినాలు, చంద్రబాబు అరెస్టుతో లాయర్ల మంతనాలు అంటూ ఒకటి కాదు వంద అడ్డంకులతో తూతూ మంత్రంగా సాగింది. టీడీపీ కేడల్లోనే ఈ యాత్రపై పలుమార్లు సందేహాలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో యాత్రలా కాకుండా సభలు మాత్రమే పెట్టాలని, రోజుకి రెండేసి గంటలు సభలు ఉండేలా, యువగళం కవర్ అవ్వని ప్రాంతాల్లో ఈ సభలు జరిగేలా ఇప్పుడు ప్లాను చేస్తున్నారు. అయితే చంద్రబాబు చేసిన రా కదలిరా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు చినబాబు చేద్దామనుకుంటున్న ఈ శంఖారావం ఎంత మేర మోగుతుందో చూడాలి మరి.