‘పల్నాడు ప్రాంత ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తే ఇప్పటికే అనుమతులు వచ్చిన వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయిస్తా’ తెలుగుదేశంలో చేరుతున్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు చెప్పిన మాటలివి. అసలు కొన్ని సంవత్సరాలపాటు ఈ ఎత్తిపోతల పథకం అటకెక్కేందుకు కారణమే చంద్రబాబు నాయుడు. మరి ఆయన పార్టీలో చేరి అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని లావు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
పల్నాడు రైతుల కల వరికపూడిసెల ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే చంద్రబాబు 1996లో శంకుస్థాపన చేశారు. అయితే 2004 సంవత్సరం వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అనుమతులు తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. 2014లో బాబు సీఎం అయ్యాక దీని గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలుమార్లు అసెంబ్లీలో వరికపూడిసెల గురించి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర అనుమతులు రావడం లేదు. వరికపూడిసెల నిర్మాణం సాధ్యం కాదని బాబు శాసనసభ సాక్షిగా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం పల్నాడు ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. 2018లో మాచర్ల పర్యటనకు వచ్చిన బాబు తనయుడు, అప్పటి మంత్రి లోకేశ్ వరికపూడిసెల కోసం ఏనాడూ స్థానిక ఎమ్మెల్యే అడగలేదని అబద్ధాలు ఆడారు. అడిగి ఉంటే ఎప్పుడో కట్టేవారమనే ధోరణిలో మాట్లాడారు. అయినా యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టి వీలైనంత తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. దీంతో తండ్రీకొడుకులు ఈ ఎత్తిపోతల పథకం విషయంలో పల్నాడు ప్రజలను మోసం చేస్తున్నారని అర్థమైపోయింది.
2019లో ఎన్నికలు సమీపిస్తున్నాయని పల్నాడు ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఓట్ల దండుకునేందుకు హడావుడిగా ఫిబ్రవరి నెలలో రూ.400 కోట్ల రూపాయలను వరికపూడిసెలకు కేటాయిస్తున్నానని బాబు చెప్పారు. అయితే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి హంగామా చేశారు. అయితే ఆయన గురించి బాగా తెలిసిన ప్రజానీకం ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వరికపూడిసెల ప్రాజెక్టు గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ పట్టు వదల్లేదు. సీఎం, ఎంపీ వద్దకు వెళ్లి చర్చించారు. చివరికి కేంద్రం నుంచి అనుమతి సాధించారు. ఎమ్మెల్యే సారథ్యంలో తొలిదశ పనులను రూ.340.26 కోట్లతో చేసేందుకు సీఎం జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. అధునాతన పైపులైన్లు వేయించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు, ప్రజలకు తాగునీటి సరఫరాకు శ్రమిస్తున్నారు.
టీడీపీ వెంట నడుస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయులు చంద్రబాబు సీఎం అవ్వగానే వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పడాన్ని పల్నాడు ప్రజలు నమ్మడం లేదు. అసలు అనుమతులు తీసుకోకుండా డ్రామాలు ఆడిన బాబును ఎలా నమ్మాలని ఎంపీని ప్రశ్నిస్తున్నారు. 29 ఏళ్లపాటు ఒక్క ఇటుక కూడా వేయని నాయకుడి చెంత చేరి వరికపూడిసెల పూర్తి చేస్తామని మోసం చేయదలుచుకున్నారా అని లావును అడుగుతున్నారు. దశాబ్దాలుగా నారా వారిని నమ్మి ఇబ్బంది పడింది చాలు. మళ్లీ మోసపోయేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని పల్నాడు వాసులు కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు.
చంద్రబాబు శంకుస్థాపన చేసిన వాటికే జగన్ మళ్లీ శంకుస్థాపన చేస్తున్నాడంటూ తెలుగుదేశం ఆ మధ్య హేళన చేసింది. అయితే వరికపూడిసెల నిర్మాణానికి ఆనాడు పర్యావరణ అనుమతులు తీసుకోని విషయం లావుకు బాగా తెలుసు. నిధులు ఇవ్వని వైనంపై బాగా అవగాహన ఉంది. కానీ తన స్వార్థం కోసం పార్టీ మారుతూ ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకుంటున్నారు. పల్నాడు ప్రజలు చైతన్యవంతులు. ఎవరి హయాంలో ఏం జరిగిందో వారికి బాగా తెలుసు.