తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చిల్లర నాయకుడంటూ గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైరయ్యారు. సోమవారం ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ బాబు ధోరణిని తప్పు పట్టారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం.. ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. అయినా సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెట్టడం దారుణం. అసలు నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే రూ. 2.50 లక్షల కోట్లు బాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే అంత అప్పు చేశారా? అని ప్రశ్నించారు.
అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు. చంద్రబాబు నుంచి ఆయన్ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉంది. చంద్రబాబుకు వాళ్ల ఓట్లు కావాలి. కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్గా పెట్టుకోలేదు. 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం జనసైనికులను స్పష్టంగా తెలుస్తుంది.
వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ను పవన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్నే కూల్చిపడేసిన వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చిన వ్యక్తి బాబు. జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయేవి ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న కాపు సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు’
ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు నాని కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ను ఐ ప్యాక్ టీమ్ నుంచి తన్ని తరిమేశారు. ఐ ప్యాక్ మెంబర్లు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం సర్వే చేస్తున్నారు. రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పీకే పనిచేస్తాడు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ చెబితే రాష్ట్రంలో ఓటు శాతం మారుతుందని బాబు ఆశ పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే చెప్పినట్లు జరగలేదుగా. ఏపీలోనూ ఆయన జోస్యం నెరవేరదు.