టీడీపీకి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు ఎన్డీయేలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేత మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో కలిసి కుమ్మక్కు రాజకీయలు చేయడం సహించలేనని.. అధికారం కోసం ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ ద్వారా తెలియచేశారు.
కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో ఉన్న పార్వతీపురం లోక్సభ స్తానం నుంచి కాంగ్రెస్ తరపున నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. పార్వతీపురం రద్దయ్యాక అరకు నియోజకవర్గం నుండి తొలి ఎంపీగా కూడా గెలిచారు. మధ్యలో ఒక సారి రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. కేంద్రంలో 2011 నుంచి 2014 వరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చక్రం తిప్పారు.
తొలి నుండి కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న ఈయన 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి చేరారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి రానున్న ఎన్నికల్లో ఆశాజనకంగా లేకపోవడంతో ఆపార్టీతో ఉంటే కూతురు శ్రుతిదేవ్ కి సైతం రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో పూర్తిగా టీడీపీకి దూరం జరిగినట్టు తెలుస్తుంది.