ఆంధ్రప్రదేశ్ లో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుడుతూ వ్యవసాయ కూలీల కొరతను అధిగమించేందుకు వీలుగా ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఆర్బీకే స్థాయిలోని సీహెచ్సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు డ్రోన్స్ ద్వారా వ్యవసాయ భూముల్లో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసే శిక్షణ ఉచితంగా ఇస్తుంది.
తాజాగా ఇండియన్ ఫర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 కిసాన్ డ్రోన్స్ను అందుబాటులోకి తీసుకురానుండగా ఆంధ్రప్రదేశ్కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మిగిలిన యూనిట్లను మార్చి నెల చివరిలో అందించనుంది. ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్ను పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఉచితం కాగా మిగిలిన అభ్యర్థులకు 15 వేలు చెల్లించాలి. శిక్షణ మొత్తానికి అయ్యే ఖర్చు 50 వేలు కానీ ఇఫ్కో సంస్థ 35 వేలు భరిస్తుండగా మిగిలిన 15 వేలు అభ్యర్థులు చెల్లించాలి.
శిక్షణ పూర్తి అయిన తరువాత డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం లేదా ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్,ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మంది శిక్షణ పొందగా వారిలో 10 మంది పొదుపు సంఘాల మహిళలు ఉన్నారు.