జనసేన తరఫున 40 నుంచి 50 సీట్ల వరకు తీసుకుంటారు అనుకున్న నేపథ్యంలో, అధికారంలో వాటా కూడా ఉంటుంది అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లే తీసుకుని సర్దుకుపోయి, జనసైనికులను సముదాయించడం మొదలుపెట్టాక కాపు నాయకుల్లో పవన్ మీద నమ్మకం సడలిపోయింది. అంతే కాక ఇచ్చిన 24 సీట్లలోనూ ఐదు సీట్లే ప్రకటించి మిగతా 19 సందేహంలో పెట్టడం తెలిసిందే.
దాంతో తీవ్రంగా ఆగ్రహించిన కాపు సామాజికవర్గం, పలు చోట్ల కాపు నాయకులు పవన్ను వీడి వైసీపీలో చేరారు. మరి కొంతమంది స్తబ్దుగా మారిపోయారు. జోగయ్య లాంటి వారు అలక పూని, మౌనం వహించారు. ముద్రగడ వైసీపీలో చేరుతుండటంతో, గోదావరి జిల్లాలలోని కాపు నాయకులు కొందరు ఏం చేయాలో పాలుపోక రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
అయితే ఇక బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన తరువాత జనసేన, బీజేపీ కలిసి 30 సీట్లలో కలిసి పోటీ చేస్తాయని, ఆ దిశగా సీట్లు కేటాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అంటే ఇప్పుడు బీజేపీకి 50-50 వాటా ఇస్తే పవన్ కి ఇచ్చిన 24 లో మళ్లీ తగ్గించుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు పవన్ ఢిల్లీకి వెళ్ళి చేసుకొచ్చింది రాయబారం లా కాకుండా కాళ్ళ బేరంలా కనపడనుంది.
అసలే తక్కువ సీట్లు పొత్తులో భాగంగా రావడం, మళ్ళీ అందులో బీజేపీ కోసం కొన్ని త్యాగం చేయాల్సి రావడం, ఇక చంద్రబాబు రెబెల్స్ పేరుతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎంతమందిని దించుతాడో తెలిరకపోవడం వంటివన్నీ కలిసి కాపులకు పవన్ అంటేనే విరక్తి వచ్చేసింది. దీనితో మెల్లగా కాపులందరూ జనసేనని వీడి వెళ్ళిపోతున్నారు.