ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన అచ్యుతరావు ఆరిలోవ ప్రాంతంలో స్ధానికంగా మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకున్నారు.
విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఏపీసీసీ జాయింట్ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్రరావు సెన్సార్ బోర్డు మెంబర్గా, పోర్ట్ ట్రస్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అనంతరం విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇన్చార్జిగా పనిచేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ సుబ్బారెడ్డి, వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.