చదువురానంత కాలం కాకరకాయ అని తీరా చదువు నేర్చుకున్నాక కీకరకాయ అనడం మొదలుపెట్టాడట. అలా ఉంది జయప్రకాష్ నారాయణ వ్యవహారం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు హడావిడి చేసిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి అభివృద్ధి కావాలంటే ఎన్డీయేకు మద్దతివ్వాలంటూ జయప్రకాశ్ నారాయణ ఓటర్లకు పిలుపునివ్వడం గమనార్హం. వాస్తవానికి సీఎం జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేనంతగా పరుగులు పెట్టింది. విద్య, ఆసుపత్రులు, పరిశ్రమలు, పోర్టులు ఇలా అన్ని రంగాలలో గతంలో లేనంత మెరుగైన అభివృద్ధిని సాధించింది. ఓసారి జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే కింది విషయాలు అర్థం అవుతాయి.
పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే మూడు రెట్ల పైబడి పెట్టుబడులను జగన్ ప్రభుత్వం ఆకర్షించడం గమనార్హం. కేంద్ర వాణిజ్య శాఖ కి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2014–18 మధ్య బాబు హయాములో రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు 33 వేల కోట్లు కాగా 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చి న పెట్టుబడులు లక్ష కోట్లు కావడం విశేషం.
2019 లో చంద్రబాబు దిగిపోయేనాటికి రాష్ట్రంలో 1,93,530 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా 2023 ఆగస్టు 31 నాటికి ఎమ్ఎస్ఎమ్ఈల సంఖ్య 7,72,802 కు చేరింది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ వెల్లడించింది. చంద్రబాబు హయాంతో పోలిస్తే అధిక సంఖ్యలో అంటే కొత్తగా 5,79,272 ఎమ్ఎస్ఎమ్ఈలు జగన్ పాలనలో ఏర్పాటవ్వడం గమనార్హం. పరిశ్రమల ఏర్పాటులో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరళతరమైన విధానాల వల్ల ఎక్కువ సంఖ్యలో ఎమ్ఎస్ఎమ్ఈలు ఏర్పాటయ్యాయి.
దేశంలో అత్యధిక తీరప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ తీర ప్రాంతంలో పోర్టులు నిర్మించి లాజిస్టిక్ హబ్ గా ఏపీని మార్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు. అందులో భాగంగానే 20 వేల కోట్లతో 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లను సీఎం జగన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోర్టుల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా కొనసాగుతుండగా మరో రెండేళ్లలో పూర్తి స్థాయిలో పోర్టులు అందుబాటులోకి రానున్నాయి.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రూ. 16 వేల కోట్లతో నాడు నేడు క్రింద ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించాడు. ఈ ఐదేళ్ల పాలనా కాలంలో సీఎం జగన్ విద్యా రంగంలో సంస్కరణల మీద పెట్టిన ఖర్చు అక్షరాలా 73 వేల కోట్లు. సీఎం జగన్ తీసుకున్న చర్యల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన సంస్కరణలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923లో మొదటి వైద్య కళాశాల ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు 96 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. ఏ పాలకుడు మెడికల్ కాలేజీల స్థాపనపై దృష్టి పెట్టలేదు. కానీ సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లలో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎం జగన్ కృషి ఫలితంగా కొత్తగా ఏర్పాటైన 5 కళాశాలల్లోఇప్పటికే తరగతులు ప్రారంభం కాగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. 2025–26లో మిగిలిన 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణ దశలో ఉన్నాయి.
అధికారం చేపట్టగానే సీఎం జగన్ ఉద్యోగాల విప్లవం తెచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2.21 లక్షలు కాగా చంద్రబాబు పాలనలో కేవలం 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టు (34 ,712) అవుట్ సోర్సింగ్ (3,83,734), ప్రభుత్వ ఉద్యోగాలు (2. 21 లక్షలు ) కలిపి ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు అక్షరాలా 6.40 లక్షలు. జగన్ పాలనలో ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు 16 లక్షలు వచ్చాయని రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి డిసెంబర్ 21, 2023న ప్రకటించారు.
ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, విద్య, వైద్య రంగంలో సమూల సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్ పరిపాలనపై జయప్రకాశ్ నారాయణ విమర్శలు చేయడం ఆక్షేపణీయం. ఆ పచ్చ కళ్లద్దాలు తీసి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని సంస్కరణలను గమనిస్తే జేపీ నోటి వెంట ఇలాంటి విమర్శలు రావు.