జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి రాజకీయాల్లోకి వచ్చాడని పోతిన మహేష్ దుయ్యబట్టారు. 2014లో సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టలేనని పవన్ కళ్యాణ్ చెప్పాడని కానీ 2024 నాటికి తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని పోతిన మహేష్ ప్రశ్నించారు.
ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, నాలాంటి పార్టీని నమ్ముకున్న వాళ్లను తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడని, పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని, మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడని ఆయన అన్నారు. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించిన పోతిన మహేష్, ఈ అంశంపై సీఐడీకి, సీబీఐకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
కాపు కమ్యూనిటీ ఇచ్చిన విరాళాలను కూడా పవన్ స్వాహా చేశారని, ఆయన బినామీ బాగోతాలన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తామని పవన్ కుటుంబ సభ్యులు పవన్ ఆస్తులకు బినామీలుగా ఉన్నారని, పవన్ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. పవన్ ఎన్నికల అఫిడవిట్ లో 28 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు 48 కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారని, కానీ చాలా ఆస్తులు పవన్ కొన్నాడన్నారు. హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయం ఒకప్పుడు అద్దె భవనమని, ఇప్పుడు సొంత భవనంగా మారిందని ,ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని ఎన్నికలు అయ్యాక సినిమా డబ్బుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చూపిస్తాడని పోతిన మహేష్ డాక్యుమెంట్లతో సహా బయటపెట్టారు.