‘తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. పొత్తు ధర్మంలో భాగంగా సొంత అన్న నాగబాబు ఎంపీ టికెట్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్. ఆయన్ను తప్పించి అనకాపల్లి లోక్సభ టికెట్ బీజేపీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు’ విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి, కమలం పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాటలివి. బుధవారం పిఠాపురంలో పవన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది ప్రజల కోసం ఏర్పడిన కూటమిలా ఆయా పార్టీల నాయకులు చిత్రీకరిస్తున్నారు కానీ.. వాస్తవానికి చంద్రబాబు నాయుడిని కుర్చీ ఎక్కించేందుకు బలవంతంగా చేసుకోబడిన పొత్తులివి. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవడం కమలం పార్టీ పెద్దలకు ఇష్టం లేదు. జనసేన.. బాబుతో పొత్తు పెట్టుకోవడం పవన్, నాదెండ్ల మనోహర్కు మాత్రమే అవసరం. జనసైనికులు దానిని అనైతిక పొత్తులానే చూస్తున్నారు.
చంద్రబాబును ఎన్డీఏలోకి తీసుకెళ్లే విషయమై హస్తిన పెద్దల్ని ఒప్పించేందుకు తిట్లు కూడా తిన్నానని పవన్ చెప్పారు. అంత అవసరం ఎందుకొచ్చిందని అనుమానం రావొచ్చు. అదంతా డబ్బు కోసమేనని జగమెరిగిన సత్యం. సేనానిని త్యాగశీలి అంటూ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రజల కోసం బీజేపీకి టికెట్లు ఇచ్చేశారనుకుంటే పొరపాటే.. ఇదంతా చంద్రబాబు ఆడించే ఆట. ఆయన చెప్పిందే కూటమిలో జరుగుతుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి, సత్యకుమార్, పవన్ పాత్రధారులంతే.
పైకి పవన్ ప్రజా శ్రేయస్సు కోరి అంటూ వంద కారణాలు చెప్పొచ్చు. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే సీట్లు వదులుకున్నాడన్నది కూటమిలోని నేతలు చెబుతున్న మాట. సుజనా, రమేష్లు బాబుకు అత్యంత సన్నిహితులు. ఏ పార్టీలో ఉన్నా టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. సీనియర్లను కాదని తన మనుషులకు టికెట్లు ఇప్పించుకున్నారంటే సేనాని పూర్తిగా బాబు కబంధహస్తాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అనకాపల్లి సీటును నాగబాబు ఆశించారు. అయితే బాబు అడగ్గానే సీఎం రమేష్ కోసం పవన్ వదిలేశారు. సరే సొంత అన్న కాబట్టి సర్ది చెప్పి ఉంటాడని అనుకోవచ్చు. కానీ విజయవాడ పశ్చిమలో చాలాకాలంగా ఇన్చార్జిగా ఉన్న పోతిన మహేష్కు అన్యాయం చేసి మరీ సుజానాకు అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు పవన్, బీజేపీలోని బాబు మనుషులు ఒకచోట చేరి నవ్వులు చిందిస్తున్నారు. ఒకరినొకరు కౌగలించుకుని పొగుడుకుంటున్నారు. కానీ అన్యాయమైపోయింది జనసైనికులు. సేనానిని నమ్మి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే చంద్రబాబు చెప్పాడని సీట్లు వదిలేశాడు. అది కూడా భారీ మొత్తంలో ప్యాకేజీ తీసుకుని.. పవన్ తాము చెప్పినట్లు ఉంటున్నాడు కాబట్టే టీడీపీ, కమలం పార్టీ నేతలు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఒకప్పుడు ఇదే సేనాని సుజానాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. తన తల్లిని దూషిస్తూ మహాటీవీలో కార్యక్రమాలు చేసింనందుకు దానికి ఫండింగ్ చేస్తున్న సుజనా లేదా ఆయన బినామీ, సీఈఓ, యాంకర్ మూర్తి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలను ఉద్ధరించడానికి కూటమి కట్టామని పైకి చెబుతున్నా.. అందరిలో అధికార దాహమే కనిపిస్తోంది. పేదలకు మంచి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని దించేసి తిరిగి పెత్తందారీ వ్యవస్థను తీసుకురావాలనేది వారి ప్రయత్నం. ఇందుకోసమే దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రజానీకానికి అబద్ధాలు చెబుతున్నారు. నిలువెల్లా స్వార్థంతో నిండిన కూటమి ఏదో చేసేస్తుందని అభూతకల్పనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారు అనుకున్నది సాధించినట్లు చరిత్రలో లేదు.
– వీకే..