ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో ఎన్నికల సమరం జరగబోతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం కాగా, టీడీపీ, జనసేన మాత్రం కూటమిగా పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవ్వడంతో పాటు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా 2024 ఎన్నికల సాంగ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ముఖ్యమంత్రి జగన్ పాటలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల సందర్భంగా ‘రావాలి జగన్ కావాలి జగన్’ అనే పాట ప్రజల్లో ఒక స్లోగన్ గా మారిన విషయం విదితమే. మంగ్లీ పాడిన ‘జగనన్న జగనన్న జనమంతా నీవెంటే’ అనే పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అదేబాటలో తాజాగా ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించపజేసే లిరిక్స్తో, ఉర్రూతలూగించే బాణీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. పాట విడుదల చేసినప్పటి నుండి సోషల్ మీడియా వేదికలపై వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు.
జెండాలు జతకట్టడమే మీ అజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అంటూ మొదలయ్యే ఈ పాటలో సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ది కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ, జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను గుర్తు చేస్తూ, మంచి చేస్తేనే మీ బిడ్డకు ఓటేయ్యండని చెప్పే జగన్ ప్రసంగాలతో రూపొందిన ఈ పాట అద్భుత స్పందన దక్కించుకుని డిజిటల్ మాధ్యమాల్లో దూసుకుపోతుంది. అద్భుతమైన బాణీతో ఆలోచింపజేసే లిరిక్స్ తో రూపొందిన ఈ పాట సూపర్ హిట్ కావడంతో వైఎస్సార్సిపి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.