‘మీకు సంక్షేమ పథాకాలు అందించేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాను. ఈ మంచి కొనసాగాలంటే మీరు ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఒక బటన్, పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక బటన్ ఫ్యాన్ గుర్తుపై నొక్కండి. లేదంటే గత ఎన్నికల్లో మీ ఓటు ద్వారా పెట్టెలో బంధించబడిన చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని మీ రక్తం తాగేందుకు లక లక అంటూ వస్తుంది. అబద్ధాలు, మోసాలతో డ్రాకులాలా రక్తాన్ని పీల్చేస్తుంది. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు ఓటేయండి. ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా తప్పుతుంది.’ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభలో అశేష జనసందోహనం నడుమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి. సంక్షేమ పథకాల రూపంలో రూ.2.55 లక్షల కోట్లను అందించిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ తనను ఆదరించాలని కోరారు. లేకపోతే తెలుగుదేశం, జనసేన ఏ విధంగా మోసం చేస్తాయో వివరించారు.
మంచి చేశారు కాబట్టే అడిగారు..
చంద్రబాబు నాయుడిలా జగన్ ప్రజల్ని మోసం చేయలేదు. హామీలిచ్చి గాలికొదిలేయలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాల మాదిరిగా కుట్రలు, కుతంత్రాలను నమ్ముకోవడం లేదు. మంచిని చూసి ఓటు వేయమంటున్నారు. రైతులారా మీకు పెట్టుబడి సాయం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలు అందించారు. ఆర్బీకేలు పెట్టి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నారు. మహిళలారా మీ కోసం చేయూత, ఆసరా, తోడు మొదలైన పథకాలను జగనన్న ఇచ్చారు. మీ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెనను చెప్పిన టైంకి ఇస్తున్నారు. గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారు. ఇంకా మీ పేరు పైనే పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తున్నారు. వృద్ధులారా ఒకప్పుడు మీరు పింఛన్ల కోసం ఎంతో కష్టపడేవారు. మరి నేడు వలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి సొమ్ము చేతిలో పెడుతున్నారు. ఆరోగ్యశ్రీతో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. ఇంకా ఎన్నో చేశారు కాబట్టే జగనన్న బటన్ నొక్కాలని కోరుతున్నారు. సంక్షేమ రారాజు కోసం ఫ్యాన్ గుర్తుపై రెండుసార్లు బటన్ నొక్కలేరా?.. 2014 – 19 వరకు జరిగిన చంద్రబాబు పాలనను.. ఆ తర్వాత వచ్చిన జగన్ పాలనను బేరీజు వేసుకోండి. మీ వేళ్లు వాటికవే విశ్వసనీయతకు మారు పేరైన వ్యక్తి అడిగినట్లుగా బటన్లు నొక్కుతాయి.