ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన జాబితాను ఇవాళ విడుదల చేశారు. ఇందులో పార్టీలో కీలకంగా ఉన్న సోదరుడు నాగబాబుతో పాటు ఓ మాజీ క్రికెటర్, జబర్దస్త్ నటులు, ఇంకా పలువురు ఉన్నారు. వచ్చే జనసేన ఎన్నికల ప్రచారంలో వీరు విస్తృతంగా పర్యటించనున్నారు.
జనసేన తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఎంచుకున్న వారిలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ , సినీ, టీవీ నటులు సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు. వీరంతా త్వరలో ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు వీరంతా జనసేన ప్రచారంలోకి దిగితే ఎన్డీయే కూటమికి సినీ గ్లామర్ వస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీకి సీనియర్ నటి జయప్రద టిడిపి తరఫున ప్రచారం చేస్తానని బహిరంగనే ప్రకటించింది. జయప్రదతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రచారం చేయబోతున్నారు అని సమాచారం. దీంతో ఈసారి విపక్ష కూటమికి సినీ గ్లామర్ అదనపు ఆకర్షణ కాబోతోంది. కాగా సీఎం జగన్ ప్రజలే తమ స్టార్ కాంపైనర్లని ప్రకటించిన విషయం తెలిసిందే.