2014 లో పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో పోటీనే చేయకుండా టీడీపీ కి మద్దతు తెలిపాడు. 2019 ఎన్నికల్లో బాబు కోసం బీఎస్పీ, కమ్యూనిస్ట్ లతో పొత్తు పెట్టుకుని 136 స్థానాల్లో పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇక గెలిచింది ఒకే ఒక సీటు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి, రెండు చోట్లా పోటీ చేసినా రెండు చోట్లా ఓడిపోయి చరిత్ర సృష్టించాడు పవన్ కల్యాణ్.
కాగా ఇప్పుడు అష్టకష్టాలు పడి, టీడీపీ తో బీజేపీ కి సయోధ్య కుదర్చి త్రికోణ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన కు బాబు ముందు కేటాయించిన సీట్లు 24 కాగా వాటిలో బీజేపీ కోసం ఇంకో మూడు త్యాగం చేయాల్సి వచ్చింది.. అంటే మొత్తంగా 21 అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండు అంటే రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్నాడు పవన్ కల్యాణ్. ముందు ముందు ఎలక్షన్ నాటికి ఆ 21+2 లో అయినా పోటీ చేస్తాడు అనేది గ్యారెంటీ లేదు..
ఈ నేపథ్యం లో హరిరామ జోగయ్య రాసిన లేఖ పవన్ కల్యాణ్ గెలుపై సందేహాల్ని రేకెత్తిస్తుంది..
పవన్ కల్యాణ్ ను టీడీపీ బలిపశువును చేస్తుంది, ఎంపీ గా పోటీ చేసి కేంద్ర రాజకీయాలలో ప్రభావం చూపే శక్తి పవన్ కు లేదు, జనసేన రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికలకి ముగిసిపోతుంది అనేది ఆ లేఖ సారాంశం..
తరచి చూస్తే ఇందులో వాస్తవం లేకపోలేదు..
ఇప్పటికే భీమిలి, గాజువాక, భీమవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, తిరుపతి. అనకాపల్లి, సీట్లను బీజేపీ కి త్యాగం చేశాడు పవన్ కల్యాణ్. జనసేనకు అంతో ఇంతో బలం ఉన్నది, గాజువాక, భీమవరం, తాడేపల్లి గూడెం, తిరుపతి లాంటి చోట్లే, ఈ స్థానాల్లో ఎక్కడో ఒక చోట పవన్ కల్యాణ్ పోటీ చేయాల్సి ఉండేది. తన బద్దకాన్ని విడిచి ఈ నెల రోజులైనా కష్టపడితే వీటిలో ఎక్కడోచోట గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టే అవకాశం ఉండేది.. వాటినీ త్యాగం చేసి అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే తన 15 ఏళ్ల తన కలను తానే చిదిమేసుకున్నట్లు అయ్యింది.
ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుండి, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్, పైన చెప్పిన సీట్లు వదులుకుని పిఠాపురం నుండి పోటీ చేయాలి అని ముందుగా భావించి ఉండొచ్చు. అనూహ్యంగా ముద్రగడ వైసీపీ లో జాయిన్ అవ్వడం, పిఠాపురం నుండి ముద్రగడ లేదా వారి కుమారుడు పోటీ చేయబోతున్నారు అనే ఊహాగానాల మధ్య ఆ పిఠాపురం నుండి పోటీ చేసే సాహసమూ పవన్ చేయకపోవచ్చు.. కాబట్టి ఈ లెక్కన పవన్ తను పోటీ చేయబోయే అసెంబ్లీ సెగ్మెంట్ పై తనకే క్లారిటీ లేదని చెప్పవచ్చు. ఇక ఎక్కడ పోటీ చేసినా అసెంబ్లీ లోకి అడుగు పెట్టడం అసాధ్యమనే చెప్పొచ్చు..
ఇక కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ కు గెలుపు అంత ఆషామాషీ కాదు.. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ కింద, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల ముద్రగడ కి బలమైన క్యాడర్ ఉంది, అనుచరులు ఉన్నారు, కేవలం కాపు ఓట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్న పవన్ కి మిగతా వర్గాల నుండి అంతగా సపోర్ట్ ముందు నుండి లేదు. ఇక ముద్రగడ వైసీపీ లో జాయిన్ అవ్వడం, తనను అవమానించిన టీడీపీ అంతు చూడాలి అని ఆయన భీష్మించుకు కూర్చోవడం వలన కాపు ఓటర్లలో చీలిక రావొచ్చు. పవన్ కు పూర్తి స్థాయిలో కాపు ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం అయితే లేదు. తుని, కాకినాడ రూరల్, సిటీ, లలో వైసీపీ బలంగా ఉంది, ఇక పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ముద్రగడకు సొంత నియోజకవర్గాలు లాంటివి. అలాంటి చోట పవన్ కు టీడీపీ ఓట్లు మాత్రమే దిక్కు. కానీ టీడీపీ క్యాడర్ కూడా పవన్ కు పూర్తి స్థాయి మద్దతు అయితే ఇవ్వదు. పవన్ ను గెలవకుండా అడ్డుకునే భాద్యత జగన్ కన్నా బాబే ఎక్కువ తీసుకుంటాడు, ఎందుకంటే పవన్ ఎదుగుదల బాబుకే ఎక్కువ నష్టం. ఎన్ని రకాలుగా చూసినా కాకినాడ పార్లమెంట్ సీట్ పవన్ గెలిచే అవకాశాలు దాదాపు శూన్యమే..
అంటే ఈసారి కూడా ఎమ్మెల్యే గానూ, కొత్తగా ఎంపీ గానూ ఓడిపోయి చరిత్ర శృష్టించడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడనుకోవచ్చు..
ఇక జనసేన పోటీ చేసే మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆ పార్టీ పరిస్థితి అధోగతే. నిడదవోలు నుండి కందుల దుర్గేష్, తెనాలి నుండి నాదెండ్ల, వీరిరువురు మాత్రమే ప్రస్తుతానికి పక్కాగా పోటీ చేయబోయే క్యాండిడేట్ లు అని అనుకోవచ్చు, ఏ క్షణంలో ఏ సీటైనా పవన్ త్యాగం చెయ్యొచ్చు. తెనాలిలో ఇప్పటికే రోజుకో రగడ, టీడీపీ క్యాడర్ నుండి నాదెండ్లకు రోజూ నిరసన సెగలు వెంటాడుతున్నాయి.. నిడదవోలు లో నాన్ లోకల్ క్యాండిడేట్ గెలుపూ, అందునా జనసేన అభ్యర్థి గెలుపు అసాధ్యం..
ఇక మిగిలిన 19 సీట్లలో పవన్ పోటీ చేసే స్థానం పోగా 18 సీట్లలో క్యాండిడేట్ ఎవరో కూడా ఖచ్చితంగా చెప్పలేని స్థితి.. మొత్తంగా విశ్లేషకులు తేల్చింది ఏమిటంటే. 2019 లో అయినా ఒక స్థానం గెలిచి అసెంబ్లీ లో జనసేన జెండా కండువాతో ప్రమాణస్వీకారం చేయగా, 2024 కి ఆ ఒక్క స్థానం కూడా గెలవకుండా జనసేన – జనాలు సున్నా గా మారనుంది. ఇంత దారుణం లో కూడా సంతోషకరమైన విషయం ఏమిటీ అంటే ఈ సారి 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఆ పార్టీ కి లేకపోవడమే..