ఏ తెలుగు రాజకీయ నేత ఢిల్లీకి వెళ్ళినా అది ఖచ్చితంగా పదవులకు సంబంధించిన విషయం కోసమో లేదా తమ నియోజక వర్గాలకి నిధులు విడుదల చేయమని విన్నవించకోడానికో అయి ఉంటుంది. కానీ బాబు గారి ఢిల్లీ ప్రయాణం మాత్రం సర్వత్రా ఆసక్తికరమే. అసలు ప్రజలను తన చలితో గజగజా వణికించే ఢిల్లీనే బాబు గారు ఆయన చాణక్యంతో 2019 లో గజగజా వణికించి అష్టదిగ్భంధనం చేసారు. ఆ తర్వాత ఆయన అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా దిగ్బంధం అయిపోయేలా జగన్ చేసారనుకోండి, అది వేరే విషయం.
అసలు, 1998లోనే భారతదేశానికి ప్రధానయ్యే అద్భుతమైన అవకాశం తన చేతుల్లోనే ఉన్నా, టెన్త్ క్లాస్లోనే ప్రపంచ మేధావి అయిన చిన్నవాడు లోకేష్ చెప్పిన మాట విని, ప్రధాని పీఠాన్ని వాజ్పేయికి వదిలేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడం కోసం కార్యాచయణలో పాల్గొన్న ప్రధాని పదవి త్యాగశీలి బాబు గారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆంధ్రలో ప్రతిపక్షంలో ఉన్నా అది కేవలం లోకకళ్యాణం కోసమే.
ఆ తర్వాత 2019 లో మోడీకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసి, తన చాణక్యాన్ని అంతా కలేసి కుదేశి, ఊరుకున్న పార్టీలని ఎగేసి, దిక్కూ దివాణం లేని నాయకులని పోగేసి మోడీని దించబోయాడు. కానీ చివరి నిమిషంలో మోడీ “బాబు గారూ నన్ను అష్టదిగ్భంధనం చేయమాకండి, అసలే పెళ్ళాం పిల్లలు లేనోన్ని” అని రహస్యంగా ప్రాధేయపడ్డాడో ఏమో తెలియదు గానీ మోడీని వదిలేసి, ఆయన ప్రధాని పదవిని మళ్ళీ ఆయనకే వచ్చేలా చేసాడు. దానితోపాటుగా తన అధికారాన్ని వదిలేసుకుని ప్రతిపక్షంలో ఉన్నాడు. అంతటి త్యాగశీలి.
అలా రెండుసార్లు భారత ప్రధాని అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్న బాబుగారు మళ్లీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. “ఏయ్ మోడీ, నిన్ను దేశ ప్రధానిని చేస్తా, నేను ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకుని నిన్ను ప్రధాని పీఠం మీద మళ్ళీ కూర్చో పెడతా. ఏపీలో ముఖ్యమంత్రి పీఠం మీద నన్ను కూర్చునేలా చెయ్. నీ మీద కనికరంతో కావాలంటే ఏపీలో బీజేపీతో పొత్తుకొస్తా” అని మోడీకి జీవితకాలంలో ఎప్పుడూ చూడని ఆఫర్ ఇస్తారో ఏమో అని ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ఆశగా ప్రధాని మోడీ బెడ్రూంలలో బాత్రూంలలో కెమేరాలు పట్టుకుని దాక్కుని ఉన్నారు. మోడీ దానికి ఏమన్నారు ఏంటి అనే విషయం రేపు పచ్చ మీడియా రాసే ఎలివేషన్ వార్తలు చదివితే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు.