ఇది పారిశ్రామిక అభివృద్ధి కాదా..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రావడం లేదని టీడీపీ నిత్యం ఆరోపిస్తుంది. కానీ అది అవాస్తవం. నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టు ఆధారంగా అనేక పరిశ్రమలు వచ్చాయి. జగన్ సీఎం అయ్యాక సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రభుత్వంలో పొదలకూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో కొత్తగా పరిశ్రమలొచ్చాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కింది. ఇక నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు పూర్తయితే మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రానున్నాయి.
జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టును నెలకొల్పింది ఇక్కడి ముత్తుకూరు మండలంలోనే. అప్పటి నుంచి పరిశ్రమల స్థాపన జరుగుతూనే ఉంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్యాక్టరీల స్థాపన జోరుగా సాగుతోంది. గత సంవత్సరం జూన్ 26వ తేదీన సీఎం వైఎస్ జగన్ వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామ పరిధిలో రూ.610 కోట్లతో క్రిప్కో బయో ఇథనాల్ ప్లాంట్, రూ.315 కోట్లతో విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇక పొదలకూరు మండలంలో రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ కోసం కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమను రూ.100 కోట్లతో స్థాపించారు. ఇక్కడ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను కేటాయించడం విశేషం. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 200 మందికి పైగా యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. దీని యజమాన్యానికి ప్రభుత్వం సింగిల్ విండో సిస్టం ద్వారా వెంటనే అనుమతులు అందజేయడం గమనార్హం. ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీలో జగన్ ప్రభుత్వంలో మూడు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఒక్కో దాంట్లో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులుగా మొత్తం 600 మందికి పైగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఇక ఎంఎస్ఎంఈల కింద నియోజకవర్గంలో పదుల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సిమెంట్ బ్రిక్స్ తయారీ, బయోమాస్ బ్రికెట్స్ తదితర పరిశ్రమలు వచ్చాయి.
తాజాగా..
ముత్తుకూరు మండలంలోని పంటపాళెంలో రూ.650 కోట్లతో ‘అన ఒలియో’ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించారు. దీనిని బుధవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ రంగంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. విశాఖలో జరిగిన సమ్మిట్లో రూ.5,765 కోట్ల మేర ఎంఓయూలు కుదుర్చుకోగా, రూ.3,921 కోట్ల వరకు పరిశ్రమలు ఏర్పాటు అయినట్లు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముత్తుకూరు మండలంలో ఎనిమిది పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కాగా, ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ హయాంలో నాలుగు ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. చట్ట ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కల్పించాలని ఫ్యాక్టరీ నిర్వాహకులను ఆయన కోరారు. వారు కూడా అంగీకరించారు.
ఒక్క నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే ఇక రాష్ట్రం మొత్తంగా ఎంత అభివృద్ధి జరిగి ఉండాలి. ప్రతిపక్షాల కంటికి మాత్రం ఇవీమీ కనిపించవు. పరిశ్రమలు రాలేదని వారు, ఎల్లో మీడియా పెద్దలు గోల చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉపాధి లభిస్తోంది.