టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు పద్ధతులు నచ్చడంలేదా.. టీడీపీ పార్టీని వీడబోతున్నారా.. అనే సందేహాలు ప్రస్థుతం కలుగుతున్నాయి. టీడీపీ మాజీ మంత్రి నారాయణకు సన్నిహిత బంధువు అయిన మాజీ మంత్రి గంటా గత కొన్నేళ్లుగా టీడీపీని వీడనున్నారు అని పలుమార్లు వార్తలు వచ్చాయి . అయితే అవన్నీ వార్తలుగానే మిగిలిపోయాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావుకి అవకాశం కల్పించే విషయంలో టీడీపీ సానుకూలంగా ఉంది కానీ .. ఎక్కడి నుండి పోటీ చెయ్యాలనే విషయంలో అధిష్టానానికి గంటాకు మధ్య విభేదాలు తలెత్తాయి.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాను చంద్రబాబు ఆదేశించగా.. నిన్న చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని ఈ జిల్లా నుండీ మాత్రమే పోటీ చేస్తానని బాబుని కోరారు గంటా . పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలంటూ చంద్రబాబు ఖరాకండీగా తేల్చిచెప్పినట్లు తెలుస్తుంది. చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపని గంటా.. నేడు తన అనుచరులతో సమావేశం అవ్వనున్నారు. తర్వాత పోటీ పైనే కాదు, టీడీపీలో కొనసాగటమా మానటమా అనే విషయం పై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం .
బిజెపి జనసేనలతో పొత్తులలో భాగంగా వస్తున్న వత్తిళ్లకు, ఎదురవుతున్న నిరసనల సెగలతో ఇప్పటికే సతమవుతున్న టీడీపీ అధిష్టానానికి పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అంశం మరో తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఆర్ధికంగా బలవంతుడు మరో సీనియర్ నేత నారాయణ సన్నిహిత బంధువు అయిన గంటాని ఈ క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ వదులుకుంటుందా, లేక అతని డిమాండ్ కి తలొగ్గి వైజాక్ లోనే సీట్ కేటాయిస్తుందా అనేది ఆసక్తికరం .