ఎన్నికల్లో గెలుపోటములు సహజం కానీ కొంతమంది నేతలు ఎన్నికల ముందు కీలక ప్రకటనలు చేస్తుంటారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కించుకున్న తర్వాత గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కానీ కొంతమంది నేతలు అలా కాకుండా ప్రజలను ఎమోషనల్ బ్లాక్మైల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారంటూ టీడీపీ కీలక నేత కందుల నారాయణరెడ్డి ప్రచార సభలో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అధినేత సమక్షంలోనే ఎన్నికల్లో పొరపాటు జరిగితే తన శవం చూస్తారంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు సామాన్యుల్లో కూడా చర్చకు దారితీసింది. ఇవే తనకు చివరి ఎన్నికలని, ఈ సారి మార్కాపురం ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. ఏదైనా పొరబాటు జరిగితే మార్కాపురం ప్రజలు తన శవం చూడల్సి వస్తుందని వ్యాఖ్యానించడం విని పక్కనే ఉన్న చంద్రబాబు సైతం షాక్ అయ్యారు. కానీ, ఎక్కడా స్పందించలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అప్పట్లో ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పైన ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు నారాయణ రెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారుతోంది. గెలుపు పైన నమ్మకం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ రెడ్డి వ్యాఖ్యల పైన ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.