పేద పిల్లలకు ఐబీ సిలబస్ (ఇంటర్నేషనల్ బాకలారియెట్) ప్రవేశపెడుతుంటే ఎల్లో గ్యాంగ్ ఏడుపు అందుకుంది. ఇదంతా సాధ్యం కాదని ప్రచారం చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల మనిషి. పిల్లల విషయంలో ఎంత దూరమైనా వెళ్తారు. గత నెల 31వ తేదీన ఈ సిలబస్ అమలుకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం దానిని ఆచరణలో పెట్టేందుకు చకాచకా అడుగులు వేస్తోంది. తాజాగా విజయవాడలో ఐబీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈనెల 26వ తేదీ నుంచి ఆ బృందాలు జిల్లాల్లో పర్యటిస్తాయి. వివిధ మేనేజ్మెంట్లలోని స్కూళ్లను పరిశీలిస్తారు. టీచర్లతో మాట్లాడుతారు. విజయవాడలోనే కొందరికి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా 2025 జూన్ నుంచి ఒకటో తరగతి పిల్లలకు ఐబీ సిలబస్లో పాఠాలు చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎందుకు..
ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా ఐబీకి గుర్తింపు ఉంది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే ఈ సిలబస్ చెప్పే స్కూల్స్ ఉన్నాయి. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బట్టీ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి థియరీతోపాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన జరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బాగా పెంచుతారు. నైపుణ్యాలకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ సిలబస్ చదివిన పిల్లలు పెద్ద యూనివర్సిటీల్లో చేరగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు వేగంగా అందుకుంటారు. దీనికి సంబంధించి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ (ఎస్సీఈఆర్టీ), ఐబీ బోర్డు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
తలరాతలు మార్చేలా..
జగన్ సీఎం అయ్యాక విద్యారంగం రూపురేఖలు మారిపోయాయి. 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు విద్యార్థుల కోసం సుమారు రూ.73,293.68 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే ఏ స్థాయిలో జగన్ శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆయన తీసుకున్న చర్యల్లో భాగంగా సర్కారు పాఠశాలల్లో ఐబీ విద్యను ఉచితంగా బోధిస్తారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి పిల్లలకు ఈ సిలబస్ బోధన మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. 2035 నాటికి పదో తరగతి, 37లో ప్లస్–2లో ఈ సిలబస్లో పరీక్షలు రాస్తారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో అవలంభిస్తున్న విధానాలు ఐబీకి దగ్గరగా ఉన్నాయని దాని ప్రతినిధులు చెప్పడం విశేషం.