మైకు దొరికితే చాలు.. ఆవేశంగా ఊగిపోవడం.. అరుస్తూ ప్రత్యర్థి పార్టీలపై అభాండాలు వేయడం.. నేతలను ఇష్టమొచ్చినట్లు తిట్టడం.. గుడ్డలూడతీసి తంతా అనడం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బాగా అలవాటు. సినిమా హీరో కావడంతో ఆ సై్టల్లోనే ఆయన వ్యవహారశైలి ఉంటుంది. కానీ రియల్ లైఫ్ వేరని, ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో తను పోటీలో ఉన్న నియోజకవర్గంలో ఒక్కసారిగా స్వరం మార్చేశాడు. పిఠాపురంలో రెండు రోజుల సేనాని పర్యటన చూస్తే తత్వం బోధపడిందని అనిపించకమానదు. 2019లో గాజువాక, భీమవరం ఓటములు ఇంకా నిద్రలో భయపెడుతున్నాయి కాబోలు..
తన కంటే చిన్నవాళ్లయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యారు. లోకేశ్ దొడ్డిదారిన చట్టసభను చూశాడు. తెలంగాణకు చెందిన కేటీఆర్ మంత్రి అయ్యాడు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. లేకపోతే ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఫాలోయింగ్ ఉన్న తాను మాత్రం ప్రజాప్రతినిధిని కాలేకపోతున్నాని సేనానిలో చాలాకాలంగా బాధ గూడుకట్టుకుని ఉంది. అందువల్లే ఈసారి పిఠాపురంలో గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. గత రెండు రోజులు అక్కడే పర్యటించాడు. సాధారణంగా అరుపులు, కేకలతో సాగే పవన్ ప్రసంగాలు ఈసారి అలా కనిపించలేదు. దేశంలో అత్యంత పాపులర్ స్టార్ మా నాయకుడని జనసైనికులు ఎగురుతుంటారు. కానీ ఆయనకు ప్రజాస్వామ్యంలో రియల్ హీరోలు ప్రజలేనని అర్థమైనట్లు ఉంది. వారి వద్ద బిల్డప్ ఇస్తే కాల్చి వాత పెడతారనే గొంతేసుకుని అరవలేదు. తనను ఒక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. గెలిస్తే ఇక్కడే ఇల్లు తీసుకుంటా. పిఠాపురం కేంద్రంగా రాజకీయం నడుపుతానని చెప్పుకొచ్చారు. ఎంత పెద్ద నేత అయినా ఎన్నికలొస్తే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాల్సిందేనని పవన్కు బాగా తెలిసింది. లేకపోతే ఎవరైనా ఆ దిశగా హితబోధ చేసి ఉండాలి.
పనిలో పనిగా సెంటిమెంట్ రగిలించేందుకు సేనాని ప్రయత్నించారు. తనకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరని, పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని పంపి ఓడించాలని చూస్తున్నారని, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, నేను గెలిస్తే హాస్పిటల్ కట్టిస్తా.. ఉద్యోగాలిప్పిస్తా.. అంటూ హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. పవన్కు మిథున్ పేరు తప్ప ఇంకేమి వినిస్తున్నట్లు లేదు. ఆయన ఎక్కడ తనను ఓడిస్తాడనే భయంతో ఉన్నాడు. అందుకే పిఠాపురం వెళ్లగానే టీడీపీ ఇన్చార్జి వర్మ వద్దకు వెళ్లాడు. నువ్వే దిక్కు మహాప్రభో అన్నాడు. ఇంత పరిస్థితికి దిగజారే బదులు 19లో ఓడిపోయాక ఏదైనా ఒక నియోజకవర్గంపై దృష్టి పెట్టి తిరుగుంటే సరిపోయేది కదా.. సినిమాల ద్వారా అలరించేస్తున్నా కదా.. నాకు ఫ్యాక్స్ కాదు.. భక్తులున్నారు.. ఎన్నికల్లో నిలబడితే ఓట్లు పడిపోతాయనుకుంటే పొరపాటే.. ఓటు హక్కుకు ఎంతో పవర్ ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబే తల వంచి దండం పెట్టే స్థాయికి తెచ్చింది.