తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి మాటపై నిలబడే అలవాటు ఎప్పుడూ లేదు. తన మనుగడ కోసం ఏదో ఒకటి చెబుతుంటారు. మొన్న సొంత పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్లోకి వచ్చేశారు. అయితే వారందరినీ తీసుకోలేను. అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటా. పొత్తులు, చేరికల వల్ల ఇప్పటికే మన పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదు’ అన్నారు. ఆయన చెప్పింది ఎప్పుడు చేశాడు. ఏదో అంటే ఇంకేదో పచ్చ పత్రికలు రాశాయి.
మీ భవిష్యత్కు నాది గ్యారెంటీ అని సభల్లో చెబుతున్న నారా వారు టీడీపీలో చేరి నా భవిష్యత్కు గ్యారెంటీ ఇవ్వండంటూ ఇతర పార్టీల నేతల్ని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా తీసుకుంటూనే.. పైకి మాత్రం తెలుగు తమ్ముళ్లకు నష్టం జరగనివ్వనని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
జగన్ పార్టీ నుంచి ముఖ్య నేతలు టచ్లో ఉన్నారని ఎల్లో గ్యాంగ్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మరోసారి తేలిపోయింది. ఈ విషయం టీడీపీ చేర్చుకుంటున్న వారిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కొద్దిరోజుల క్రితం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఓ కార్పొరేటర్ను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తీసుకెళ్లి సాక్షాత్తు బాబు చేత కండువా కప్పించిన విషయం తెలిసిందే. ఆ కార్పొరేటర్ కోసం నారాయణ డబ్బు, సామాజికవర్గం కార్డు వాడారు.
ఇక తాజాగా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసిన చోటా నేత సూరా శ్రీనివాసులురెడ్డికి కండువా వేసి మా పార్టీ బలపడిందని తెలుగు తమ్ముళ్లు డ్యాన్స్ వేసినంత పని చేస్తున్నారు. సురా వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇంకా వివిధ విషయాల్లో అవినీతికి పాల్పడ్డారు. అప్పుల పేరుతో దళితుల నుంచి నగదు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.దీంతో కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయన్ను పార్టీ నుంచి గెంటేశారు. ప్రజలకు చెడు చేసేవారికి స్థానం లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు దినేష్రెడ్డి వెంటనే సూరాకి గేలం వేశారు. వీరికి నైతిక విలువలతో పనిలేదు. ఎలాంటి వారైనా సరే వాడుకుంటారు. ఆయన్ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ నుంచి ముఖ్య నేతలు వస్తున్నారని ఆనందపడి అపాయింట్మెంట్ ఇచ్చిన నారా వారు తీరా చోటా నాయకుల్ని చూసి ఉసూరుమన్నారు. నేను పెద్ద నేతల్నే తీసుకుంటానని బిల్డప్ ఇచ్చిన ఆయన ఆఖరికి ఇందుకూరుపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కైలాసం ఆదిశేషారెడ్డి, వారి సతీమణి మాజీ ఎంపీపీ రేణుక, సూరా శ్రీనివాసులురెడ్డి, ఆయన భార్య బుచ్చి జెడ్పీటీసీ సభ్యురాలు సూరా ప్రదీపా, మూడో వార్డు కౌన్సిలర్ అందె ప్రత్యూష, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పుట్టా ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ వట్టూరు రాఘవరెడ్డి, కైలాసం పృథ్వీ, అందె రంజిత్కు కండువాలు కప్పి సరిపెట్టుకున్నారు.
ఎన్నికల్లో టీడీపీకి హైప్ తెచ్చేందుకు నాకు వైఎస్సార్సీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కావాలి. ఎంత ఖర్చైనా సరే.. అక్కడ అసంతృప్తిగా ఉన్న వారిని కొనుగోలు చేయాలని చెప్పిన చంద్రబాబుకు ద్వితీయ శ్రేణి నాయకులే దిక్కయ్యారు. అది కూడా ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఎవరో పెద్ద నాయకులు వస్తారని టైం కేటాయిస్తుంటే చోటా నేతలకు కండువాలు కప్పించే స్థాయికి తనను దిగజార్చారని బాబు తెగ బాధపడిపోతున్నారని సమాచారం. మరోవైపు ఎవరో ఒకరు వచ్చారులే.. నా భవిష్యత్కు కొంచెమైనా గ్యారెంటీ దొరుకుతుందని సర్ది చెప్పుకొంటున్నారని తెలుగు తమ్ముళ్ల మాట..