విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరడంతో, వచ్చే నెలలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తూ ఏపీ ట్రాన్స్పోర్ట్ ఈడీ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగకరంగా ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించనుంది.
మార్చ్ నెలలో టెన్త్ & ఇంటర్ విద్యార్థులకు పరీక్షలున్న నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కోరారు. పదవ తరగతిలో ఆరు లక్షల మంది, ఇంటర్ లో పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 10వ తరగతి పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకూ జరగనుండగా ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ జరగనున్నాయి. బస్సు పాస్ లేని విద్యార్థులు పరీక్షల హాల్ టికెట్లను చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచిత ప్రయాణం చేయొచ్చని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.