దేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు గంభీర్ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాగారికి నా అభ్యర్థన. నా భవిష్యత్తు క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడం కోసం దయచేసి రాజకీయ విధుల నుంచి నన్ను తప్పించాలని కోరుతున్నా. అలాగే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ప్రధానమంత్రి మోదీగారికి, హోం మంత్రి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జైహింద్ అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.
కాగా 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన గంభీర్ 147 వన్డేలలో 5238 పరుగులు, 58 టెస్టులలో 4154 పరుగులు, 37 టీ20లలో 932 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుని నడిపించి రెండుసార్లు చాంపియన్గా నిలిపిన గంభీర్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించారు. ఈ ఏడాది తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి మెంటార్ గా వ్యవహరించనున్నారు. క్రికెట్ కామెంటేటర్గా కూడా గంభీర్ పని చేస్తుండడం గమనార్హం.
తన వివాదాస్పద తీరుతో తరచూ వార్తల్లో నిలిచిన గంభీర్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరి తూర్పుఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 6,95,109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి బీజేపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్న గంభీర్ అకస్మాత్తుగా రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించడం ఆసక్తికరంగా మారింది. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు గంభీర్ వెల్లడించిన నేపథ్యంలో తిరిగి రాజకీయాల్లోకి వస్తారా లేక పూర్తిగా దూరం అవుతారా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతుంది. కాగా గంభీర్ తాజా నిర్ణయం పట్ల నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది..