గంటా శ్రీనివాసరావుని చూసి ఇలా పాడుకునేలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి. ఎక్కే గడప దిగే గడప చందాన.. ప్రతి ఎన్నికలకూ ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేలా ఉంది ఆయన రాజకీయ ప్రస్థానం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మౌనాన్ని ఆశ్రయించి గత నాలుగేళ్ళుగా టీడీపీతో పెద్దగా సంబంధం లేనట్టుగానే గడిపారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చిన వేళ టికెట్ అవసరం పడటంతో ఆయన మళ్ళీ టీడీపీ వైపు ఆశగా చూస్తున్నారు.
పార్టీకి ఉపయోగపడినవారికే.. టికెట్లిచ్చే విషయంలో పొమ్మనకుండా పొగబెట్టే బాబు.. ఇలా దూరంగా ఉండి మళ్ళీ టికెట్ల కోసం వచ్చిన వారి విషయంలో ఎలా ప్రవర్తిస్తారో మనకి తెలియంది కాదు. గంటా దూరంగా ఉన్నా కూడా టీడీపీకి నాయకుల అవసరం ఉండటంతో ఇన్నాళ్ళూ బాబు ఆయనను చేరదీసినట్టు ఉన్నారు కానీ.. ఇప్పుడు టికెట్కై ఆశావహం వ్యక్తం చేస్తున్నపుడు బాబు మార్కు చాణక్యానికి తెర లేపారు. గంటాని అతని సొంత నియోజకవర్గం నుంచి కాకుండా, నూటయాభై కిలో మీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి నుంచి బొత్స పై పోటీ చేయమని చెప్పడంతో… నోరెళ్ళబెట్టడం గంటా వంతయింది.
ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. “నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందనీ, నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదనీ, విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నాననీ” చెప్పారు. అయితే “నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150కిలోమీటర్ల దూరం.పైగా జిల్లా కూడా వేరు కావడంతో ఆలోచనలో పడ్డా” అంటూ గంటా వాఖ్యానించడం విశేషం.
ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలకపోగా,
కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిన నేపధ్యంలో గంటా మార్పు తద్యమేనన్న సూచనలు కనపడుతున్నాయి. “నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?. పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను. రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తాను. ప్రతీ ఎన్నికల్లో నేను నియోజకవర్గం మారుతున్నా. కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది” అంటూ గంటా చేసిన వాఖ్యలు… నియోజకవర్గ మార్పుపై ఆయన ఖంగుతిన్నారన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.