టికెట్ల కేటాయింపులు, అసంతృప్తులు, గొడవలతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్లో మాత్రం ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో చేరికలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాకిడి పెరిగింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీ కండువాలు కప్పించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నాయకుడు నవుడు వెంకటరమణ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈయన 2019 ఎన్నికల్లో ఉంగుటూరు నియోజవకర్గం నుంచి సేన అభ్యర్థిగా పోటీ చేశారు. చంద్రబాబు నాయుడితో పొత్తు, టికెట్లు తక్కువగా తీసుకోవడంతో పవన్ కళ్యాణ్పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కార్యక్రమంలో రీజనల్ కో–ఆర్డినేటర్ మిథున్రెడ్డి పాల్గొన్నారు.
పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన యండపల్లి శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆయనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. యండపల్లిది చిత్తూరు జిల్లా. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు 2011, 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చాలా కాలం యూటీఎఫ్లో పనిచేశారు. ఉపాధ్యాయుల్లో బాగా పట్టు ఉంది. 17లో మంత్రి పొంగూరు నారాయణ సన్నిహితుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పట్టభద్రుల ఎన్నికల్లో మట్టి కరిపించారు. యండపల్లి చేరిక కార్యక్రమంలో మిథున్రెడ్డి, నేతలు మురళీధర్, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్ జగదీశ్వర్రెడ్డి, విష్ణు పాల్గొన్నారు.