నీరే లేకపోతే జీవం లేదు. ఇదే భవిత.. ఆ నీటితోనే పంటల పండి ఆహారం లభిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కురిసే ప్రతి చినుకును ఒడిసి పట్టేలా.. భూగర్భ జలం పెరిగేలా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఫాంపాండ్స్ తవ్విస్తోంది. ఇందుకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఏకకాలంలో కూలీలకు ఉపాధితోపాటు రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రైతుల పొలాల్లో ఉచితంగా ఫాంపాండ్స్ (నీటి కుంటలు) తవ్వేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా, ఎండా కాలంలో సైతం రైతులు ఇబ్బందులు పడకుండా పంటలు సాగు చేసుకునేలా ఈ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా లక్ష్యాలు విధించారు. సన్న, చిన్నకారు రైతులు మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిని ఉపాధి సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు జిల్లా అధికారులకు పంపుతున్నారు. అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నారు. అనంతరం ఫాంపాండ్స్ను ఉపాధి హామీ కూలీలతో తవ్విస్తారు. ఒక్కో దానికి 140 పనిదినాలు కల్పిస్తున్నారు. రైతుకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటే అతను కూలీలతో కలిసి పని చేసుకునే వెసులుబాటు కల్పించారు.
మెట్ట ప్రాంతాల్లో రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. వానలు పడితేనే పంటలు సాగు చేసేందుకు వీలవుతుంది. అలాగే బీడు భూములు సాగులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ నిధులతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతోంది. రైతుల పొలాల్లో ఫాంపాండ్స్ తవ్వడం ద్వారా వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. వర్షాలు లేని సమయంలో కుంటల్లో అందుబాటులో ఉన్న నీటితో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.20 లక్షల వ్యయం
సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద కమ్యూనిటీ ఫాంపాండ్స్ నిర్మాణానికి ఉద్యాన శాఖ వందశాతం సబ్సిడీ ఇస్తోంది. నీరు డ్రిప్ ద్వారా పారించుకోవడానికి వీలుగా 25 ఎకరాలు ఒకే చోట ఉండాలి. యూనిట్ కాస్ట్ రూ.20 లక్షలు ఉంటుంది. చెరువు తరహాలో ఉండే దీని సామర్ధ్యం 3 కోట్ల లక్షల లీటర్లు. వర్షపు నీటితో నిండే విధంగా వాలును బట్టి తవ్వతారు. ఒకసారి దీనిని నింపుకుంటే వర్షాభావం ఏర్పడి బావులు, బోర్లలో నీరు ఇంకిపోయినప్పుడు మూడు నెలల వరకు బిందు సేద్యం ద్వారా పంటలకు నీటిని ఇచ్చుకోవచ్చు. ఇంకా వ్యక్తిగతంగా కూడా రైతులకు ఉద్యాన శాఖ ఫాంపాండ్స్ మంజూరు చేస్తోంది. వీటి సామర్ధ్యం 12 లక్షల లీటర్లు ఉంటుంది. యూనిట్ కాస్ట్ రూ.1.50 లక్షలు ఉండగా.. ఎంఐడీహెచ్ కింద 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.
ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఫాంపాండ్స్ నిర్మాణాలు రైతుల పాలిట వరంలా మారాయి. అక్కడ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలకు రక్షక తడులు ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి గత ఏడాది ఆఖరి వరకు 29 కమ్యూనిటీ ఫాంపాండ్స్ తవ్వారు. వీటి ద్వారా 290 హెక్టార్లకు నీటి సదుపాయం కల్పించారు.
చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని పేరుంది. ఆయన హయాంలో వానలు కురవడం తక్కువ. దీంతో ఫాంపాండ్స్ తవ్వకాల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులు ఉపాధి పనులను తనిఖీ చేసిన సమయంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. దీంతో రికవరీలకు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి.