రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 70 శాతం మందికి పైగా రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల సాగును వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ఉద్యాన శాఖ ద్వారా విరివిగా రాయితీలను అందజేస్తోంది. దీంతో నిమ్మ, మామిడి, కూరగాయల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సమీకృత ఉద్యాన మిషన్ (ఎంఐడీహెచ్) ద్వారా ప్రభుత్వం రైతులకు రాయితీలను అందజేస్తూ యాంత్రీకరణను ప్రోత్సాహిస్తోంది. పూలతోటల సాగు కోసం పాలీహౌస్ల నిర్మాణానికి రూ.లక్షల్లో రాయితీలను అందజేస్తోంది. రైతులకు వివరించేందుకు అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.
రాయితీలను మూడు విడతలుగా పంపిణీ చేసి రైతులకు పండ్ల తోటల సాగుపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతేకాక తోటల సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు హెక్టారు విస్తీర్ణంలో మామిడి సాగుకు రూ.13,300, నిమ్మ, బత్తాయి సాగుకు రూ.16,004, టీసీ అరటి సాగుకు రూ.1,33,199, బొప్పాయికి రూ.24,663, జామ సాగుకు రూ.29,335 ఇస్తోంది. హెక్టార్ విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు రూ.40,000, ఉసిరి, నేరేడు, చింత సాగుకు రూ.18,000, హైబ్రీడ్ కూరగాయల సాగుకు రూ.20,000, ఆయిల్పామ్కు రూ.29,000, ఇందులో అంతర పంటల సాగుకు రూ.21,000, ఎరువులకు రూ.21,000 అందజేస్తోంది. హెక్టార్లో పూల సాగుకు రూ.16,000, మల్చింగ్ ఏర్పాటుకు రూ.16,000 అందిస్తోంది. మల్లె, చామంతి, కనకాంబరం, బంతి, లిల్లీ పూల సాగుకు కూడా ప్రభుత్వం రాయితీలను అందజేస్తోంది. సన్న, చిన్నకారు రైతులు పెట్టే మొత్తం ఖర్చులో 40 శాతం, ఇతర రైతులకు 25 శాతం హెక్టార్కు అందజేస్తోంది. రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ శాశ్వత పందిళ్లపై కూరగాయల సాగుకు హెక్టార్కు రూ.2.50 లక్షలను ప్రభుత్వం అందిస్తోంది.
యాంత్రీకరణకు ఇలా..
ఉద్యాన యాంత్రీకరణకు రాయితీలు కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా మినీ ట్రాక్టర్కు రూ.75 వేలు, పవర్ ట్రిల్లర్కు రూ.4 వేలు, తైవాన్ స్ప్రేయర్కు రూ.4 వేలు, మొబైల్ మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్కు రూ.10 లక్షలు, కమ్యూనిటీ నీటికుంటకు రూ.20 లక్షలు, నీటికుంటకు రూ.75 వేలు, ప్యాక్హౌస్కు రూ.2 లక్షలు, కోల్డ్రూమ్స్కు రూ.5.25 లక్షలు, షేడ్నెట్ (4,000 స్క్వేర్ మీటర్స్) రూ.35.5 లక్షలు అందజేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాయితీలకు ఎగనామం పెట్టింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యాన పంటలకు అందించే రాయితీలు బేషుగ్గా ఉన్నాయని లబ్ధి పొందుతున్న రైతులు చెబుతున్నారు. వాటిని మిగిలిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.