సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు. నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పెద్ద దిక్కని చెప్పుకొంటుంటాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈ సీనియర్ నాయకుడి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. రికార్డు స్థాయిలో ఓటములు మూటగట్టుకున్న చరిత్ర ఉంది. 19లో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 24లో టికెట్ వచ్చేది అనుమానమే. అయితే సీటు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతున్నారు. ఇటీవల ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సేవలు నిలిచిపోతున్నాయని, వేలాది మంది ఉపాధి కోల్పోతారంటూ ప్రచారం చేశారు. అయితే అదంతా అబద్ధమేనని శుక్రవారం కంటైనర్ వెసల్ రాకతో తేలిపోయింది. ఇక ఎన్నికల నేపథ్యంలో సోమిరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా స్వచ్ఛందంగా పార్టీలు మారే కార్యకర్తలను చూస్తుంటాం. అయితే మేము రాము మహాప్రభో అనే వారికి బలవంతంగా కండువాలు కప్పుతున్నారు ఈ టీడీపీ కురవృద్ధుడు. నాకు చాలా బలం ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికొస్తానని అధిష్టానానికి చూపించుకునేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు.
చంద్రమోహన్రెడ్డి కొంత కాలంగా బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చూసేందుకు వెళ్లే మహిళలు, యువకులకు తమ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. వారు తిరిగి వైఎస్సార్సీపీ కండువాలు వేసుకుని తామెక్కడికి పోలేదని మీడియా ముందు చెబుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఇలాగే జరుగుతోంది. ఇల్లు కట్టుకునేందుకు నగదు ఇస్తానని, జేసీబీ యంత్రం కొనిస్తామని మాటల్లో పెట్టి సోమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పుతున్నారని తెలుస్తోంది. అయితే ఆ కార్యకర్తలు కాకాణి వద్దకు వెళ్లి అసలు విషయం చెబుతున్నారు. జగన్ అభిమానులు ఎవరికీ అమ్ముడుపోరని గోవర్ధన్రెడ్డి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని సోమిరెడ్డికే నమ్మకం లేదు. చాలాసార్లు ఓడిన నేపథ్యంలో ఆయనకు చాన్స్ ఇవ్వొద్దని లోకేశ్ చెప్పినట్లు సమాచారం. ఇక సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్రెడ్డి గ్రామాల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండో లోకేశ్ గా ఈయన పేరు తెచ్చుకున్నారు. జనంలో ఏ మాత్రం గుర్తింపు లేదు. దీంతో రాజకీయాల నుంచి తమ కుటుంబం తప్పుకోవాల్సి వస్తుందని ఈ పొలిట్బ్యూరో సభ్యుడు బాధలో ఉన్నాడు.
చంద్రబాబేమో వైఎస్సార్సీపీ నుంచి చోటా నాయకులు వచ్చినా తీసుకుంటున్నారు. ఆయన పార్టీ నేతలేమో గ్రామాలకు వెళ్లి జగన్ అభిమానులకు కండువాలు కప్పి సంబరపడిపోతున్నారు. అభిమానం అనేది గుండె లోతుల్లో నుంచి రావాలి. తమకు తాముగా వెళ్లి కండువాలు మెడలో వేయించుకోవాలి. అప్పుడే విలువ ఉంటుంది.