నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారులు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అయితే ఈ సింబల్స్ కేటాయింపుతో అంతటా గందరగోళం నెలకొంది. మరి ముఖ్యంగా జనసేన పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అయోమస్థితిలోకి నెట్టింది. దీంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ తీరును జనసైనికులు దుయ్యబడుతున్నారు.
పార్టీ నిర్మాణంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా వారాంతపు పొలిటీషియన్ లా వ్యవహరిస్తూ జనసేన పార్టీని నిర్లక్ష్యం చేసి పార్టీకి సింబల్ లేకుండా చేసారని పవన్ కళ్యాణ్ పై జనసేన శ్రేణులు రగిలిపోతున్నారు. మొదటినుంచి పార్టీ గుర్తు మీద ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించని పవన్ కళ్యాణ్ తీరుపై మరియు పార్టీ సింబల్ గాజు గ్లాసు విషయంలో జనసేన పార్టీ క్యాడర్ మొత్తం నిరుత్సాహానికి గురైంది. మొదటినుండి సీరియస్ పాలిటిక్స్ చేసి ఉంటే పార్టీకి ఈ గతి పట్టేదా అని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు ను కేటాయించడంతో జనసేన వర్గాలతో పాటు కూటమి నేతలు భగ్గుమంటున్నారు. జనసేన పోటీలో ఉన్న నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు సింబల్ ను ఎన్నికల సంఘం కేటాయించేందుకు వెనుకాడకపోవడం కూటమిని గందరగోళానికి గురి చేస్తుంది. కానీ తాము పది శాతానికి పైగా సీట్లలో పోటీకి నిలుచున్నామని జనసేన ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎన్నికల కమీషన్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడం జనసేనకు మింగుడు పడటం లేదు.