ఆది నుండీ టీడీపీ కరపత్రికగా, చంద్రబాబు భజన ప్రధానంగా మసలుకొనే ఈనాడు పత్రిక తమ దిగజారుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారన్న విచక్షణ లేకుండా నిస్సిగ్గుగా మరో అసత్య కథనంతో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి పూనుకుంది. ఇందుకోసం ఒక దివ్యాంగురాలి ఆత్మహత్యను పావుగా వాడుకుంది. నిజాలకు పాతరేస్తూ ఓ అసత్య కథనాన్ని వండి వార్చి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిన ఈనాడు, దివ్యాంగుల మరణాన్ని కూడా ప్రభుత్వంపై బురదజల్లడానికి వాడుకోవడం ఖచ్చితంగా ప్రతీఒక్కరూ ఖండించాల్సిన విషయం.
అసలు జరిగిందేమిటంటే..
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ అనే దివ్యాంగురాలు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సదరు ఘటనలో నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం పింఛను తొలగించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. కానీ ఎప్పుడో 17 నెలల కిందట పింఛను తొలగిస్తే, ఆ మనోవ్యధతో ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారా అనే చిన్న ప్రశ్న ఈనాడుకు కలగకపోవడం గమనించాల్సిన విషయం.
నిజానికి చంద్రబాబు హయాంలో ఒక కుటుంబానికి 2.5 ఎకరాల భూమి లేదా ఐదెకరాలకు మించి మెట్ట భూమి ఉన్నా ఆ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా ఆ కుటుంబంలో సభ్యులు పింఛనుకు అనర్హులని అప్పటి ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం నిబంధనల పేరుతో పేదలు ఎక్కువగా ఇబ్బందులు పడకూడదని అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనల్ని సడలించి దెకరాల దాకా వ్యవసాయ భూమి ఉన్నా పింఛను మంజూరుకు అర్హులుగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ చనిపోయిన సరోజమ్మ కుటుంబానికి 12 ఎకరాలకు పైనే వ్యవసాయ భూమి ఉంది. అంతేకాక ఆ కుటుంబంలోనే ఓ యువకుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైల్వేలో దాదాపు నెలకు రూ.50 వేల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సరోజమ్మ కోటా పింఛను పొందుతున్నారని గుర్తించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఆ పింఛన్ని 17 నెలల క్రితం తొలగించారు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని 17 నెలల క్రితం తొలగించిన పింఛనుకు ముడిపెట్టి కథనాలు రాయడం ఈనాడుకే చెల్లింది. మేం బురద జల్లుతాం మీరే కడుక్కోండి అన్న చందంగా ఓ పార్టీకి లబ్ది కలిగించే కథనాలను రామోజీ రాయడం వాటిని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. నిజానికి గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 22 లక్షల మందికి పైగా పేదలకు జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు నేరుగా చేరవేస్తున్న జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలంతా తిప్పికొడుతున్నారని ఈనాడు ఎప్పటికి గ్రహిస్తుందో ఆ రామోజీకే తెలియాలి.