తెలుగుదేశం, ఈనాడు వేరు కాదు. రెండూ ఒక్కటే.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పై పడి ఏడుస్తుంటాయి. శనివారం నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈసీ నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. ఏ స్థాయి అధికారి అయినా.. ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా.. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా సరే ఎవరికీ మినహాయింపు ఉండదు.
కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. ఈ విషయం తెలిసినా ఈనాడు అధికారులపై దుమ్మెత్తిపోస్తూ కథనం రాసింది. వాళ్లు ఇంకా వైఎస్సార్సీపీ ప్రభుత్వ సేవలో తరిస్తున్నారని తప్పుడు కథనం ప్రచురించింది. ‘ప్రతిపక్షాల ఫ్లెక్సీలపైనే ప్రతాపం.. వైఎస్సార్సీపీ ప్రచార చిత్రాల జోలికెళ్లలేదంటూ వార్తను అచ్చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినా అధికారులు వైకాపా జపం వీడడం లేదు. ఫ్లెక్సీలు, జెండాల తొలగింపులో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రచార సామగ్రిపైనే ప్రతాపం చూపించారు. సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫొటోలున్న వాటిని చూసీచూడనట్లు వదిలేశారు’ అంటూ చేతికొచ్చింది రాసింది రామోజీరావు పత్రిక. కానీ నిజం కాదు. అందుకు ట్విట్టర్ (ఎక్స్)లో తెలుగుదేశం అధికారిక ఖాతాలో పెట్టిన పోస్టే నిదర్శనం. సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్న వీడియోను పెట్టి పిచ్చిపిచ్చి రాతలు రాసింది. వాళ్ల రాతల్ని పక్కన పెడితే తొలగిస్తున్నట్లు సాక్షాత్తు టీడీపీయే ఒప్పుకొంది. మరి ఏపీలో ఈనాయుడిగా ముద్ర ఉన్న పత్రిక మాత్రం అధికారులను టార్గెట్ చేస్తూ అసత్యాలను వండి వార్చింది.
కోడ్ వచ్చాక ఈసీ దృష్టిలో ఎవరైనా ఒక్కటే. ప్రతి వీధిలో నాలుగైదు ఫ్లెక్సీలు ఉంటాయి. వాటిని అరపూటలో తొలగించడం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించకుండా యంత్రాంగంను తిడితే ఏం చేయగలరు. పైగా వారి పార్టీ ఏమో సిద్ధం ఫ్లెక్సీలు తొలగిస్తున్న వీడియో పోస్టు చేసింది. ఇప్పుడు జనం ఏ విషయాన్ని నమ్మాలి.. అందుకే క్రాస్ చెక్ చేసుకోవాలనేది..