ప్రతీరోజు ప్రభుత్వంపై అసత్య కథనాలతో విష ప్రచారానికి తెగబడే ఈనాడు పత్రిక మరోసారి తన మార్క్ పచ్చ రాతలతో రెచ్చిపోయింది. విమానయాన రంగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ‘రెక్కలు విరిచారు’ అంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది. కానీ విమానయాన రంగంలో జగన్ సర్కారు చేసిన అభివృద్ధిని దాచిపెట్టి ఓ పార్టీకి లబ్ది చేకూర్చే కథనాలను వండి వార్చింది. ఈనాడు కథనంలో పచ్చ రాతలను పక్కనబెట్టి వాస్తవాలను పరిశీలిస్తే విమానయాన రంగంలో చంద్రబాబు హయాంలో కంటే జగన్ సర్కారు ఆధ్వర్యంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్న విషయం తేటతెల్లం అవుతుంది.
విమానయాన రంగం – వాస్తవాలు
1) భోగాపురం ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయింది నాటి టీడీపీ ప్రభుతం. పైగా ఎన్నికల ముందు ఎలాంటి అనుమతులు లేకుండా, భూసేకరణ చేయకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేయడం చంద్రబాబుకే చెల్లింది.
కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబులా అనుమతులు లేకుండా శంకుస్థాపన చేయకుండా
అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే భూసేకరణ చేసి మే 2023లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. మొత్తం 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్ సంస్థతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఒప్పందం కుదుర్చుకునే సమయానికి గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమేసేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది.. 2025 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది.
2) కర్నూలు ఎయిర్పోర్టు
2017లో కర్నూలు ఎయిర్పోర్టుకు కూడాశంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తికాకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ, వాస్తవంగా అప్పటికి రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ వంటి కీలక నిర్మాణ పనులేవీ 30 శాతం కూడా పూర్తికాలేదు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించింది. అంతేకాక.. కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్, అనుమతులతో పాటు ఎస్పీఎఫ్ ఫోర్స్లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం జగన్ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చుచేసింది. 70 శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేయడంతో పాటు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది.
3)తెట్టు వద్ద ఎయిర్కార్గో హబ్..
నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ జగన్ సర్కారు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్పోర్టును నిర్మించాలని నిర్ణయించింది. ఎయిర్ కార్గొ హబ్గా ఈ ఎయిర్పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు. త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలుపెట్టే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది.
4)కోవిడ్ వల్ల కుదేలైన విమానయాన రంగం
కోవిడ్ వల్ల విమానయాన రంగం దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ట్రూజెట్, జెట్ ఎయిర్వేస్ దివాలా తీయగా, స్పైస్జెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేసిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్ ఎలా కారణం అవుతాడో రామోజీకే తెలియాలి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కొత్తగా జైపూర్, గోవా, కడప, కోల్కత, తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభం కావడంతో పాటు విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు.. ఆస్ట్రేలియా, యూరప్లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది.
విమానాశ్రయాల అభివృద్ధి..
రాష్ట్రంలో మొత్తం 7 విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి అయిదింటిని ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోండగా, కర్నూలు ఎయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది. రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ బిల్డింగ్లను నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాజమండ్రి విమానాశ్రయాన్ని రూ.350 కోట్లతో విస్తరణ పనులకు ఇటీవలే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా శంకుస్థాపన చేశారు. అదే విధంగా కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో ఈ ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. విజయవాడ టెర్మినల్, రన్వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్ చేసే విధంగా ఎంఆర్ఓ యూనిట్ను ఏర్పాటుచేయనున్నారు. కర్నూలు ఎయిర్పోర్టులో పైలెట్ శిక్షణా కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్స్ హబ్గా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దనుంది.
రూ.20వేల కోట్లతో తీరప్రాంత అభివృద్ధి..
కేవలం ఎయిర్పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా పెద్దఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు గ్రీన్ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ల్యాండ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్లు వెచ్చిస్తోంది. జగన్ ప్రభుత్వం విమానయాన రంగాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తుంటే రామోజీ రావు మాత్రం ఈ నిజాలను దాచేసి పచ్చ రాతలకు తెగబడటం జగన్ ప్రభుత్వంపై ఆయనకున్న హేయభావానికి నిదర్శనంగా చెప్పొచ్చు