మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేదల కల నెరవేరుస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎం చేతుల మీదుగా శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సాపురం ఆగ్రహారంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను చదును చేసి ప్లాట్లుగా విభజించి హద్దురాళ్లు వేసే ప్రక్రియ జోరందుకుంది. ఇంకో వైపు రోడ్ల కోసం కేటాయించిన ప్రాంతాన్ని చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఇక అక్కడే సీఎం రాక కోసం హెలిప్యాడ్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం సభాస్థలికి వచ్చే మార్గంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు.
సీఎం ఒంగోలు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ శుక్రవారం ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.15 గంటలకు ఒంగోలు అగ్రహారం వద్దకు చేరుకుంటారు. పదినిమిషాలపాటు ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు. అక్కడి నుంచి ఆగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఇంటి స్థలాల లేఅవుట్ పైలాన్ వద్దకు చేరుకుంటారు. 10.40 గంటలకు సభావేదికకు వెళ్తారు. 10.45 గంటలకు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.50 నుంచి 11 గంటల వరకు స్టాల్స్ను పరిశీలిస్తారు. 11.05 గంటలకు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సభ పరిచయ వాక్యాలను వినిపిస్తారు. మరో 10 నిమిషాలపాటు వేదికపై ప్రజాప్రతినిధులు ప్రసంగిస్తారు. 11.25 నుంచి 11.35 గంటల వరకు లబ్ధిదారులు తమ సంతోషాన్ని సీఎంతో పంచుకుంటారు. 11.35 నుంచి 12.35 వరకు గంటపాటు జగన్ ప్రసంగిస్తారు. 12.35 గంటలకు అదనపు సీసీఎల్ ఏఎండీ ఇంతియాజ్ వందన సమర్పణతో సభ ముగుస్తుంది. 12.40 గంటలకు వేదిక వద్ద నుంచి బయలుదేరి 12.45 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. గంటపాటు స్థానిక నేతలతో ముఖాముఖి సమావేశమవుతారు. 1.50 గంటలకు బయలుదేరి 2.25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం రాక సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. దీంతో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఇటీవల ప్రకటించారు. హద్దు మీరితే ఆఫీసులు ముట్టడిస్తామని వారికి వార్నింగ్ ఇచ్చారు. పేదలకు మంచి చేసేందుకు చేపట్టిన కార్యక్రమం విషయంలో నీచంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు.