నిస్పృహలో జనసేన. టీడీపీకి ఏ ముహూర్తాన సెంట్రల్ జైలు బయట పొత్తు ప్రకటించిందో కానీ అప్పటి నుంచి జనసేనకు, జనసైనికులకూ నిరాశా నిస్పృహలకు లోనవడం దినచర్య అయిపోయింది. “టీడీపీ వాళ్ళు ఏమైనా అన్నా మీరు సంయమనం కోల్పోవద్దు” అని పవన్ అన్నప్పటి నుంచే జనసైనికులకు అవమానాలకు ఎదురవడం మొదలయ్యాయి. నిన్న ప్రకటించిన స్థానాలను నోట్బుక్లో రాసి చూపించిన విధానం చూసాక జనసేన అనుచరులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆఖరుకి పోలియో చుక్కలు వేయించుకోండి అనే సందేశాన్ని కూడా జనసేన లెటర్హెడ్ మీద రాసి లేఖ విడుదల చేసే పవన్ కళ్యాణ్ అలా తెల్ల కాగితంపై తెల్ల మొహం వేసుకుని అభ్యర్థుల పేర్లు చదవడం చూసాక, అసలు అప్పటివరకూ బాబు ఏ సీట్లు జనసేనకు ఇస్తున్నారో కూడా పవన్కు తెలియదన్న మాట అనే నిర్ణయానికి వచ్చేస్తారు జనసైనికులు.
అసలు పొత్తు మొదలు నుంచీ కూడా అధిక సంఖ్యలో సీట్లు, అధికారంలో వాటా… ఒకానొక సమయంలో “లోకేష్ సీయం పదవి గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు” అంటూ చెప్పిన పవనేనా ఇప్పుడు 24 సీట్లకు ఒప్పుకున్నదీ అని జనసైనికులకు అనుమానం కలుగుతోంది. ఆ ఒప్పుకున్న స్థానాల్లో కూడా కేవలం అయిదు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించడం వల్ల కూడా తీవ్ర నిస్పృహకు గురయ్యారు.
టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో కూడా జనసేనకు ఇస్తామని మాట ఇచ్చిన కొన్ని స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఉన్న జనసేన ఆశావహులు ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరం అని వాపోతున్నారు. అంతేకాకుండా జనసేనకై ప్రకటించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని కూడా ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం త్యాగం చేయించి, అక్కడ ప్రకటించిన అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ను నెల్లూరు నుంచి పోటీ చేయమని అడిగడంలో కూడా జనసేన బానిసత్వమే తప్ప పొత్తులో సమస్థాయి లేదని జనసైనికులకు తెలియటంలో వారిలో ఆందోళన అధికమవుతుంది.
మిగిలిన 19 స్థానాలు ఎక్కడ నుండో తెలియక, అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలియక, ఒక వేళ బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే.. దాని ప్రకారం జనసేన వాటాలో కోత పెట్టి తగ్గిస్తారో తెలియక, ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్థానాల్లో ఎంతమందిని వెనుక నుంచి రెబెల్స్గా నామినేషన్ వేయిస్తారో అర్దం కాక జనసైనికులు ఢీలా పడిపోయారు. సోషల్ మీడియాలో తమ కోపాన్ని పవన్పై తీవ్ర స్థాయిలో చూపిస్తున్నారు.
టీడీపీ తనకు బలం లేని స్థానాలను, గెలిచే సత్తా లేని సీట్లను జనసేనకు వాటాగా ఇచ్చిందనేది గమనించి జనసైనికులు తల్లడిల్లుతున్నారు. అయితే ఇన్ని కారణాల తర్వాత జనసేన ఓటు బ్యాంకు టీడీపీకీ పడడం గగనమే. అలానే పవన్ను ప్రత్యేకంగా ఓడించాలని తెలుగు తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారు. అతను గెలిస్తే అధికారంలో వాటా అడగగలడనీ, ఆపై ఎన్నికలు వచ్చేనాటికి చంద్రబాబుకు వృద్ధాప్యం వచ్చాక, లోకేష్ను తప్పించి తానే పగ్గాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు కనుక.. అతనిని ఆదిలోనే వంచడం మంచిదని ఆలోచిస్తున్నారు. మరి ఇంత చిత్తు చిత్తుగా ఉన్న ఇదేమి పొత్తు ధర్మమో మరి!!!