ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన డీబీటీ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేయడం ప్రారంభించింది. గత ఐదేళ్లుగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏడాది సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని కుట్ర పూరితంగా ఎన్నికల కమీషన్ కి టీడీపీ బీజేపీ జనసేన కూటమి పిర్యాదు చేయడం కారణంగా డీబీటీ నిధుల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిధుల విడుదలకు అవకాశం ఇచ్చినా ఎన్నికల కమీషన్ ఎన్ఓసీ ఇవ్వని కారణంగా నిధులు విడుదల కాలేదు. తద్వారా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ లాంటి పథకాలకు నిధుల విడుదల నిలిచిపోయింది. ఎన్నికల కమీషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకి ఎలా అవకాశం ఇచ్చారు ? ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఎన్నికల కమీషన్ ని ప్రశ్నించింది? ఎన్నికల కమీషన్ హైకోర్టు కంటే ఎక్కువ అనుకుంటుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కాగా ఎన్నికల తరువాత నిధుల విదుదలకు అభ్యంతరం లేదని ఎన్నికల కమీషన్ చెప్పడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత డీబీటీ కింద నిధులు విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే నిన్న వైయస్ఆర్ ఆసరా కింద 1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కు రూ.502 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా మిగిలిన పథకలకూ రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను జగన్ ప్రభుత్వం పూర్తిచేయనుంది. టీడీపీ కూటమి కుట్రలతో నిధుల విడుదలను అడ్డుకున్నా పేదలకు లబ్ది చేకూర్చేందుకు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.