ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్ను ఎగవేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అల్లుడు కె.పునీత్ పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా పునీత్ అరెస్ట్ సహా ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని బాలాజీనగర్ పోలీసులకు సూచించింది.
అసలేం జరిగిందంటే..
నారాయణ విద్య సంస్థల అల్లుడు పునీత్ ఎండీగా ఉన్న ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ 32 బస్సులు కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలపై ఇన్వాయిస్లు తీసుకున్నారని, నకిలీ పత్రాలు సృష్టించి దురుద్దేశపూర్వకం గా పన్ను ప్రయోజనాలు పొందారని నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దాంతో ఈ కేసును కొట్టేయాలని కోరుతూ పునీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి కె.పునీత్ పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఎలక్షన్ ఫండ్ కోసం పెద్దఎత్తున పొంగూరు నారాయణ డబ్బును సేకరించారని ఇందుకోసం తన నారాయణ కళాశాలలను వేదికగా మార్చారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న మార్వాడీల దగ్గర రూ. ఐదు రూపాయల వడ్డీకి ఎంత దొరికితే అంత నగదును సేకరించారని అందుకోసం ఎలాంటి రసీదులు లేకుండా టోకెన్లు ఇచ్చి పంపారని విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందడంతో సేకరించిన డబ్బును ఎక్కడికి తరలించారో తెలుసుకోవడానికి పోలీసులు నారాయణ విద్యాసంస్థలతో పాటు మరి కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు. త్వరలోనే తరలించిన డబ్బును పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.