ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన, అభ్యర్థుల సమన్వయం, ప్రచార కార్యక్రమాలలో పార్టీల అధినేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సిపి, ఎన్డీఏ కూటమి టిడిపి జనసేన బీజెపీ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు.కానీ కాంగ్రెస్ కి సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు జరగలేదు. ఈరోజు ఎట్టకేలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. పలువురు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నట్లు తెలిపారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు , మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రచారంకి పరిమితం అవుతున్నట్లు తెలిపారు.
175 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతలో 114 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 25 ఎంపీ సీట్లకు గాను 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల జాబితాను హైకమాండ్కు అందజేశారు. ఆశావహుల నుంచి గెలుపు గుర్రాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే అందరూ ఊహించిన విధంగానే, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కడప ఎంపీ సీటు కోసం వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా.. షర్మిల తన సోదరుడితోనే పోటీ పడనున్నారు. ఇక కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పల్లం రాజు, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ సీటు నుంచి జేడీ శీలం, కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
ఎమ్మెల్యే సీట్ల సంగతికి వస్తే మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ శింగనమల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు.కుప్పంలో చంద్రబాబుపైకి పోటీగా ఆవుల గోవిందరాజులను హస్తం పార్టీ నిలుపుతోంది.అలాగే ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సిట్టింగ్ స్థానాల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఆ తర్వాత ఇప్పటి వరకూ నిలదొక్కుకోలేక పోయింది . 2019 ఎన్నికల్లో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎన్ని శాతం ఓట్లు దక్కించుకొంటుందో చూడాలి .
The CEC of Congress has selected the following AndhraPradesh State candidates for the ensuing general elections to the Lok Sabha. pic.twitter.com/uy4n5wPdRm
— Andhra Pradesh Youth Congress (@AP_pyc) April 2, 2024