వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంది. ఇప్పటికే వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అనుకూలంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా మినుములు, పెసలు, వేరుశనగ సేకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
2023 – 24 రబీ సీజన్లో పెసలు 84 వేల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, శనగ 5.26 లక్షల టన్నుల్లో దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుములుకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధరను ప్రకటించారు. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని, రైతులు తొందరపడి పంటను అమ్ముకోవద్దని మార్క్ఫెడ్ అధికారులు సూచించారు.
ఇక పసుపు రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాకు రూ.6,850గా ఉంది. గత సంవత్సరం జూన్, జూలై నెలల్లో క్వింటాలు రూ.5,300 నుంచి రూ.6,250 పలకడంతో ప్రభుత్వం స్పందించింది. రూ.36 కోట్లను వెచ్చించి 5,020 టన్నులను మద్దతు ధరకు సేకరించింది. దీంతో ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో క్వింటాలు రూ.8 వేల నుంచి రూ.11,750 పలికింది. ప్రస్తుతం ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర వస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడి హయాంలో క్వింటా ధర ఏనాడూ రూ.6,358కి మించలేదు. ఐదు సంవత్సరాలుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పసుపునకు గరిష్టంగా రూ.14 వేల ధర లభిస్తోందన్నారు.