రేపు సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. కాగా 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక ఆసరాగా జగన్ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.18,750 చొప్పున నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది.
వైఎస్సార్ చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 666.50 కోట్లను అందజేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 478.49 కోట్ల సాయం పొందగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 188.01 కోట్లను ప్రభుత్వం సాయంగా అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు రూ. 250 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రేపు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఈ విధంగా కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు. అక్కడినుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.