సీఎం వైఎస్ జగన్ ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్ననేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. లూథరన్ గ్రౌండ్స్ నుండి మూడు కిలోమీటర్ల మేర సాగే రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దారిపొడుగునా ప్రజలంతా సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో బహిరంగ సభ నిమిత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం పాల్గొనే ఈ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ బహిరంగ సభలో సుమారు 50 వేలమంది విద్యార్థులు, ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. సీఎం జగన్ గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.