విశాఖపట్నం పర్యటనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం జగన్ సమావేశమయ్యారు. యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే
విశాఖపట్నం పెదగంట్యాడకు చెందిన దీపిక మాట్లాడుతూ.. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంగారికి నా కృతజ్ఞతలు
– దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై
విశాఖపట్నంకు చెందిన భార్గవ్ మాట్లాడుతూ.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను, అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను. అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్గా ఏడాదికి రూ. 7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంగారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్మోడల్ స్టేట్గా ఉందని నేను నమ్ముతున్నాను.
– భార్గవ్, విశాఖపట్నం