వెనుబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్ఈజెడ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
విశాఖ – విజయనగరం సరిహద్దుల్లో బాక్సైట్ నిక్షేపాలు విరివిగా ఉన్న నేపథ్యంలో శృంగవరపుకోట మండలంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు జిందాల్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 2005లో జేఎస్డబ్ల్యూ అల్యూమినియం లిమెటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. 180 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. అప్పట్లో ప్రభుత్వం మరో 985 ఎకరాలను కేటాయించింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు వద్దని గిరిజనుల కోరగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రజాభీష్టం మేరకు తవ్వకాలను నిషేధించారు. దీంతో జేఎస్డబ్ల్యూ అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం సేకరించిన భూమిని మరోలా వినియోగించాలని సీఎం ఆదేశించారు. జిందాల్ యాజమాన్యం కూడా ఓకే చెప్పి ఇటీవల ఎంఎస్ఎంఈ పార్క్ లేదా లాజిస్టిక్స్ పార్క్ ప్రతిపాదనను తెచ్చింది.
ఉత్తరాంధ్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో దీర్ఘకాలంగా వృథాగా ఉన్న భూములు వినియోగింలోకి రానున్నాయి. 1,146 ఎకరాల్లో రూ.531 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో రూ.15,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 45 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. టైక్స్టైల్స్, అపెరల్స్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశముంది. ఇక్కడే ఏర్పాటు చేయడానికి అనుకూలతలు చాలా ఉన్నాయి. ఇది రాజమహేంద్రవరం – విజయనగరం హైవేకు ఆనుకుని ఉంది. విశాఖ పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి అందుబాటులో ఉంది. చెన్నై – హౌరా రైల్వే లైన్, విశాఖ – కిరూండల్ రైల్వే లైన్లకు సమీపంలో ఉంది. తాటిపూడి రిజర్వాయర్ కూడా సమీపంలోనే ఉండటంతో పార్క్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఇప్పటికే..
విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా గుర్తించిన స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో నక్కపల్లి క్లస్టర్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు బీజం పడింది. ఈ ఎస్ఈజెడ్ కోసం 1,120 ఎకరాలు సిద్ధం చేశారు. వాటిలో వసతుల కల్పనకు సర్కారు రూ.399 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను విస్మరిస్తే జగన్ మాత్రం ప్రగతి పథంలో నడిపిచేందుకు కృషి చేస్తున్నారు. పరిశ్రమలు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయి.