స్వాతంత్ర్యం వచ్చి డెభ్బయ్యేళ్ళు దాటుతున్నా.. ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జగన్ మొదటి రోజు నుండే పని మొదలుపెట్టారని ఉత్తరాంధ్ర వైకాపా నాయకుడు అవంతి శ్రీనివాస్ తెలిపారు. నిన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. జగన్ తాను ప్రజాసంకల్ప యాత్ర చేసినపుడే ఉత్రాంధ్రలోని వెనుకబాటుతనం, పేదరికం వంటివి చూసి చలించిపోయారు.
అన్నిటిలోనూ ఆయనను విపరీతంగా కలచివేసింది ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రజలు కిడ్నీ సంబంధిత జబ్బులకు లోనుకావడం. ఇన్నేళ్ళయినా ఇక్కడ తాగేందుకు సరైన నీరు లేకపోవడం వల్ల ప్రజలు కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని తెలుసుకుని బాధ పడ్డారనీ, అందుకే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడాన్ని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారనీ, సీఎంగా కుర్చున్న మొదటి రోజు నుంచీ ఉత్తరాంధ్ర అభివృద్ధికై పాటు పడ్డారని అవంతి తెలిపారు. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఉద్దానం చుట్టుపక్కల తాగునీరు మెరుగైందనీ, పేద ప్రజలను అనారోగ్యం నుంచి రక్షించడానికి కిడ్నీ స్పెషల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ కూడా కట్టారనీ వివరించారు.
ఏడొందల కోట్లతో ఉద్దానమందు వాటర్ ప్లాంట్లు కట్టించడమే కాక, నెలకు పదివేల చొప్పున పదివేలమంది కిడ్నీ పేషెంట్లకు అవసరార్ధం నగదు సహాయం చేయడం కూడా ఆయన ఆలోచనల్లో భాగమే అని అవంతి తెలిపారు. జగన్ రాయలసీమకు చెందిన వాడైనా తన ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలనే స్వార్థం ఏమీ లేకుండా ఉత్తరాంధ్రను కూడా అభివృద్ధి చేసి వెనకబాటుతనాన్ని నిర్మూలించారనీ, ఉత్తరాంధ్ర ప్రజల పాలిట జగన్ దేవుడితో సమానమని అవంతి శ్రీనివాస్ కొనియాడారు.
మూల పేట సీ పోర్టు, ఉధ్దానం వాటర్ ప్లాంట్లు, పార్వతీపురంలో గిరిజన యూనివర్సిటీ, ఇంజినీరింగు కాలేజీ నిర్మాణం వంటివి జగన్ చేసిన అత్యుత్తమ అభివృద్ధిలో భాగమనీ, రాబోవు ఎన్నికల్లో ప్రజలు వాటిని చూసే వైకాపాకు ఓటేస్తారని జోస్యం చెప్పారు అవంతి శ్రీనివాస్.
అంతేకాక, విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చడమే జగన్ లక్ష్యమనీ, దాని కోసమే మార్చ్ మొదటి వారంలో విజన్ విశాఖ అనే కార్యక్రమం చేపట్టారనీ, ఎప్పటికైనా విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో ముందుంచుతారనీ, విశాఖ కేంద్రంగానే రాబోవు ప్రభుత్వంలో పాలన ఉంటుందనీ అవంతి తెలిపారు. ఇలా జగన్ ఉత్తరాంధ్ర కు చేసిన మంచి పనులను చెబుతూ అవంతి జగన్ను ఆకాశానికెత్తేసారు.