విశాఖపట్నంలో తెలుగుదేశం మనుషుల వద్ద 25 వేల కిలోల డ్రగ్స్ బయటపడడంతో ఎల్లో గ్యాంగ్ ఏడుపులు మామూలుగా లేవు. ఈ వ్యవహారంలో అంతా తమ వారే కనిపిస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్పై నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అసలు చంద్రబాబు గత పాలన చూస్తే గంజాయిని ప్రోత్సహించింది ఆయనే. దాని సాగు ఆయన హయాంలోనే విస్తారంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లే యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు.
బాబు సీఎంగా ఉన్నప్పుడు గంజాయి సాగు అధికంగా జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆనాటి ప్రభుత్వ పెద్దలు కొందరు పోలీసుల సహకారంతో యువతను మత్తులో ముంచి జేబులు నింపుకొన్నారన్నది నిజం. ఈ విషయాలను అప్పట్లో మంత్రులే ఒప్పుకొన్నారు. 2017లో విశాఖకు చెందిన చింకాయల అయ్యన్న పాత్రుడు గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు, పెద్దల పాత్ర ఉందని బహిరంగంగా చెప్పారు. దేశం మొత్తానికి గంజాయి రవాణా విశాఖ నుంచే జరుగుతోందని 2017లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిని బట్టి నారా వారా పాలనలో ఈ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపారు. చంద్రబాబు ఏకంగా గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తారా అని అసంతృప్తి వ్యక్తం చేశారంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించిందో తెలుస్తోంది. తనకు మద్యం, సిగరెట్ అలవాటు లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి జగన్. అలాంటి అతను డ్రగ్స్ విషయంలో ఇంకెంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను అరికట్టేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. దీనికి విస్తృతంగా అధికారాలు కల్పించింది.
సెబ్ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఏకంగా 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాటిల్లో టోల్ప్లాజాలు, రైళ్లలో, బస్సుల్లో తనిఖీలు చేసి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 13,210 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 2,950 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి సాగు ధ్వంసంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సాక్షాత్తు పార్లమెంట్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చింది.
ఇక గంజాయి సాగుపై ఆధారపడిన గిరిజనులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించారు. ఇందుకోసం రూ.144 కోట్లతో ‘ఆపరేషన్ నవోదయం‘ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రస్తుతం ఏపీలో గంజాయి సాగు లేదు. కానీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఒడిశా నుంచి ఏపీ మీదుగా రైళ్లు, బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నారు. తనిఖీల సమయంలో వారిని మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ సంబంధం లేకపోయినా టీడీపీ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తోంది.