ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ, వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.5,060.49 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7 నుంచి 14 రోజుల పాటు పండగ వాతావరణంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమం జరగనుంది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక ఆసరాగా జగన్ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.18,750 చొప్పున నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. నిధుల విడుదల అనంతరం బహిరంగసభకు హాజరైన మహిళలు, ప్రజలనుద్ధేశించి మాట్లాడిన సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందురోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్ధిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగులో వారికి తోడుగా ఉంటూ.. అందులో భాగంగా ఈరోజు వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి శ్రీకారం చుడుతున్నాం.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా…
భారతదేశ చరిత్రలోనే దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. మహిళాపక్షపాత ప్రభుత్వంగాఆ పదానికి అర్ధం చెబుతూ ఈ 58 నెలల పాలన తర్వాత వైఎస్సార్ చేయూత కార్యక్రం నాలుగోవిడత నిధులను 45–60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమం మరో 14 రోజుల పాటు పండగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ పాలుపంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.. 45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బ్రతుకుతున్నారు? ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నాయి? ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందని కనీసం ఆ ఆలోచన కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు.
45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆ అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే ఆ అక్కచెల్లెమ్మలు బాగుపడటమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చేశాం. వారికి తోడుగా ఉంటూ ప్రతీఏటా రూ.18,750 వారి చేతిలో పెడుతూ వారి జీవనోపాధి కోసం మార్గాలు చూపిస్తూ.. ఏకంగా రూ.75,000 ఆర్ధిక సహాయం చేస్తానని… ఇదే విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో ఈ చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పాను. ఈ రోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం రూ.75,000 ఇచ్చే ఈ కార్యక్రమంలో నాలుగోవిడత కూడా ఇదే అనకాపల్లి జిల్లాలోనే చేస్తున్నాం.
చేయూత – అక్కచెల్లెమ్మల కుటంబాలకు తోడుగా.
ప్రతి అక్కచెల్లెమ్మ తాను తన కాళ్లమీద నిలబడేటట్టుగా, వరుసగా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ.. వారికి బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ.. అమూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఐటీసీ, పీఅండ్ జీ, రిలయన్స్, హిందుస్తాన్ లీవర్ వంటి కంపెనీలతో తోడ్పాటునిస్తూ.. వాటితో టై అప్ చేయిస్తున్నాం. ప్రతి సంవత్సరం రూ.18,500 ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ కంపెనీలు, బ్యాంకుల నుంచి కూడా అక్కచెల్లెమ్మలకు అండదండగా ఉంటూ ఏకంగా 1.69లక్షల మంది అక్కచెల్లెమ్మలు కిరాణాషాపులను నడుపుతుండగా… 85,630 మంది అక్కచెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తుండగా 3,80466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేయగా…88923 మంది ఆహార ఉత్పత్తులుకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది అక్కచెల్లెమ్మలకు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. మరో 2,59,997 మంది అక్కచెల్లమ్మలు మిగిలిన రకరకాల వ్యాపారం చేస్తూ వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి ఇంటిని కూడా నడుపుతున్నారు. 16,55,991 మంది అక్కచెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబానికి కూడా తోడుగా ఉంటున్నారు. వైఎస్సార్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ నాలుగో విడతగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.5060 కోట్లు ఇవాళనుంచి మరో 14 రోజుల పాటు పండగ వాతావరణంలో కార్యక్రమానికి ఇవాళ మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తున్నాడు.
4 ఏళ్లలో 33 లక్షల మందికి పైగా రూ.19,189 కోట్లు
ఈ ఒక్క వైఎస్సార్ చేయూత అనే పథకం ద్వారా ఏకంగా రూ.75వేలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్టయింది. ఈ పథకం ద్వారా 58 నెలల కాలంలోనే 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఈ చేయూత పథకం ద్వారా 33,14,916 మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందితే నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు చూస్తే మరో రూ.56,188 కోట్లు కూడా మంచి జరిగింది.
చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా.. కేవలం మీ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ పిల్లలకు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా స్కూళ్ల రూపురేఖలు మీ బిడ్డ మారుస్తాడు. అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడిన ప్రభుత్వం, ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు.
గత ప్రభుత్వానికి మహిళలు మేలు చేసిన చరిత్రలేదు.
గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, వారి పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, వారు పెద్ద చదువులు చదవాలని, అందుకోసం ఏ తల్లీదండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆలోచన చేశాం. జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెనమొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, అలా చేస్తే పిల్లల తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి వారిని ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయినీ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది.
కుదేలైన పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం.
వైయస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం. గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఏకంగా 18శాతం ఎన్పీఏలు, ఔట్ స్టాండింగులుగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది.
గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి.
వైయస్సార్ చేయూత ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలో ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? ఆలోచన చేయండి. అలాగే 45–60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు.
సొంతిళ్లు లేని అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల స్ధలాలు…
సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా.. ఒక్క సెంటైనా, ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే. ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లు.
చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ రోజు ఏకంగా 1.30 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఏ అక్కచెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, పోలీస్ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి తోడుగా నిలబడినందువల్ల మంచి జరిగింది.
మహిళా సాధికారతలో ఏపీ నెంబర్ వన్..
ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది.
లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. మహిళా సాధికారత పరంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే.
ప్రతిపక్షం పేరు చెబితే మోసాలు, వంచనే గుర్తుకొస్తాయి. మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?
చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు.
రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశారు.అప్పట్లో టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి మెడలో తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద.. ప్రతి సిలిండర్ మీద నెలకు రూ.100 చొప్పున సంవత్సరానికి రూ.1200, 5 సంవత్సరాల్లో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు.
మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు.పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి. బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు. ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి, మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు.
2014 ఎన్నికలలో ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి నమ్మిన అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప వారిని ఆదుకోవాలని మనసు రాలేదు.
గ్యాస్ సిలిండర్ల మీద నెలకు రూ.100, ఏడాదికి రూ.1200, ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు.
వీళ్లను నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే.
ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా.
సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి.చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు.రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది.
రానున్న ఎన్నికల్లో…
మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు. దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది. చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు.ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లు… మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు. చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు.
నియోజకవర్గ అభివృద్ధికి. మంత్రి అమర్, భరత్ కలసి అనకాపల్లి అగ్రికల్చర్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్, రిపేర్లు, అభివృద్ధి పనులు, గోడౌన్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు, శారదా నది మీద పుట్ ఓవర్ బ్రిడ్జి కోసం రూ.3 కోట్లు, అదే విధంగా రేబాక కొప్పాక రోడ్డు విస్తరణ కోసం రూ.3 కోట్లు, తుంపాల శివాలయం నుంచి బొజ్జన్నకొండ, తుంపాల దిబ్బపాలెం నుంచి బలివాడ కోసం రూ.4 కోట్లు, అదే విధంగా కశింకోట జగనన్న కాలనీలో ప్రొటక్షన్ వాల్ కోసం రూ.6 కోట్లు అడిగారు. ఇవన్నీ మంజూరు చేస్తున్నాను అని హామీ ఇస్తూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.